హైదరాబాద్ : నగరంతో పాటు శివార్లలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు రవాణా సౌకర్యార్థం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నాలుగు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ – నాగపూర్ జాతీయ రహదారిపై సుచిత్ర జంక్షన్, డైరీ ఫామ్ జంక్షన్, దూలపల్లి జంక్షన్, మేడ్చల్ టౌన్ వద్ద నాలుగు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సీఎం నిర్ణయించిన నేపథ్యంలో ఆ స్థలాలను మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు వివేకానంద, బాల్క సుమన్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, NHAI అధికారులు ఉన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నాలుగు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి NHAI, ఆర్ అండ్ బీ శాఖ అధికారులు కలిసి డీపీఆర్లు రూపొందించారని తెలిపారు. సుచిత్ర నుంచి గుండ్లపోచంపల్లి వరకు 10 కి.మీ పొడవునా మూడు ఎలివేటెడ్ కారిడార్లు, నాలుగు అండర్ పాస్లు, సర్వీస్ రోడ్లు, జంక్షన్ల విస్తరణ జరగనుందన్నారు. దీనికోసం సుమారు రూ. 450 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు రూపొందించామని మంత్రి వేముల చెప్పారు.
అలాగే గుండ్లపోచంపల్లి నుంచి కళ్లకల్ వరకు 17 కి.మీ సర్వీస్ రోడ్లు, జంక్షన్ల విస్తరణ, మేడ్చల్ టౌన్లో ఫ్లై ఓవర్ కు భూసేకరణ నిమిత్తం సుమారు రూ. 800 కోట్ల నిర్మాణ అంచనా వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. NHAI తో సంప్రదింపులు జరుపుతున్నామని త్వరలోనే ఈ ప్రాజెక్టు మొదలయ్యే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయని మంత్రి వేముల స్పష్టం చేశారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడానికి బృహత్తర ఆలోచన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, NHAI అధికారులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.