నెట్వర్క్ మహబూబ్నగర్, ఏప్రిల్ 17 : ఉద్యోగులు కదం తొక్కారు. నిరసన ప్రదర్శనలు, నినాదాలతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ దద్దరిల్లాయి. శుక్రవారం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పీఆర్సీతోపాటు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ల వద్ద, పట్టణ, మండల కేంద్రాల్లోని ఆర్డీవో, తాసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన చేపట్టారు. నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు భోజన విరామ సమయంలో అసహనం ప్రదర్శించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ప్రజాపాలనలో ‘హామీలు అమలు అయ్యేదెప్పుడు-ఉద్యోగుల కష్టాలు తీరేదెప్పుడు’ అన్న ఫ్లెక్సీలను ప్రదర్శించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతులు అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ 2వ పీఆర్సీని 51 శాతం ఫిట్మెంట్తో వెంటనే అమలు చేయడంతోపాటు ఉద్యోగులకు వెంటనే హెల్త్ స్కీమ్ను అమలు చేయాలని, సీపీఎస్ను రద్దు చేయాలని నినాదించారు.