కోస్గి, ఏప్రిల్ 17 : సీఎం ఇలాకా కోస్గిలో బుల్డోజర్లు విరుచుకుపడుతున్నాయి. లక్షల్లో ప్రజాధనం వృథా చేస్తూ అధికారులు నాయకులకు వత్తాసు పలుకుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా హడావుడిగా కూల్చివేతలు మొదలుపెట్టారు. గతేడాది కట్టిన నిర్మాణాలు మావే అని గొప్పలు చెప్పిన నేతలు ఇప్పుడు వాటిని కూడా నామరూపాలు లేకుండా చేశారు. రెండేళ్ల కిందట సీఎం రేవంత్రెడ్డి చొరవతో లైబ్రరీని అత్యాధునిక సౌకర్యాలతో ప్రారంభించామని గొప్పలు చెప్పిన నేతలు ఇప్పుడు వాటినే కూల్చేస్తున్నారు. కనీసం లైబ్రరీలో ఉన్న సామగ్రి తరలించకుండా ఓ మూలన కప్పేసి కూల్చివేతలు మొదలుపెట్టారు. ఏడాది కిందట ప్రభుత్వ పాఠశాల కోసం ఓ కాంగ్రెస్ నేత ప్రహరీ నిర్మించి ఇది మా ప్రభుత్వ గొప్ప అని ప్రగల్భాలు పలికారు. కానీ ఇప్పుడు ఆ గోడను సైతం కూల్చి లక్షల రూపాయల ప్రజధనాన్ని వృథా చేశారు.
నాయకులు కేవలం వాళ్ల జేబులు నింపుకోడానికే హడావుడిగా నిర్మాణాలు చేసి ఇప్పుడు కూల్చివేతలపై మౌనం వహిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. కోస్గి-దౌల్తాబాద్ రహదారి విస్తరణ పనులు కోసం చేపడుతున్న ఈ పనులు వల్ల చాలామంది చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారు. తమకు కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదని మండిపడుతున్నారు. ఇదే విషయంపై నమస్తే తెలంగాణ కమిషనర్ను సంప్రదించగా ఆయన ఫోన్ స్విచాఫ్ రావడం గమనార్హం. హడావుడిగా కూల్చివేతలు చేస్తూ ప్రజాధనం వృథా చేయడంపై బీఆర్ఎస్ కోస్గి ఇన్చార్జి వెంకట నర్సిములు మండిపడ్డారు. సీఎం ఇలాకాలో అభివృద్ధి జరుగుతుందంటే తమ పార్టీ స్వాగతిస్తుందని అంతేకాని ఇలా ఇష్టారీతిన కూల్చివేతలు చేపడుతూ ప్రజధనాన్ని వృథా చేస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు.
ఏడాది కిందట హడావుడిగా అభివృద్ధి పేరుమీద మీరే నిర్మాణాలు చేసినప్పుడు మీకు రోడ్డు విస్తరణ జరుగుతుందని తెలియదా అని ప్రశ్నించారు. కేవలం మీ జేబులు నింపుకోడానికి అప్పుడు నిర్మాణాలు చేసి ఇప్పుడు ప్రజధనాన్ని వృథా చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చేస్తారని ప్రజలు మీకు పట్టం కడితే ఇలా హడావుడిగా కూల్చివేతలు దేనికని ప్రశ్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా ప్రజాపాలన మరిచి బుల్డోజర్ల పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం వారు బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి కూల్చివేతలను పరిశీలించారు. కార్యక్రమంలో కోనేరు సాయప్ప, బెజ్జు నర్సింహులు తదితరులు ఉన్నారు.