హైదరాబాద్ : ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు వివిధ ఆలయాలకు ప్రభుత్వం రూ. 15 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి మంజూరు చేసిన రూ. 15 లక్షల చెక్కును సోమవారం మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో ఆలయ ఈఓ మనోహర్ రెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 25న సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్లోని మిగిలిన ఆలయాలకు రేపు ఉదయం శ్రీఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆర్థిక సాయాన్ని అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.