కొల్లాపూర్: దేశంలోనే వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం కల్వకోలులో రూ.1.20కోట్లు, కొల్లాపూర్ మండలం కుడికిళ్లలో రూ.1.50కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ఆదివారం నాగర్కర్నూల్ ఎంపీ రాములు, స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి, కలెక్టర్ శర్మన్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కుడికిళ్లలో మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడారు.
పెద్ద గ్రామాలైన కల్వకోలు, కుడికిళ్లలో విద్యుత్ ఉపకేంద్రాలను ప్రారంభించడం వల్ల కరెంట్ సమస్యలు తీరుతాయన్నారు. తెలంగాణలో కరెంట్ సమస్య లేకుండా చేశామన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని గుర్తు చేశారు. సమైక్యాంధ్రప్రదేశ్ నుంచి విడిపోయాక తెలంగాణలోనే మిగులు కరెంట్లో దేశంలోనే మనం ఉన్నామని మంత్రి వెల్లడించారు. తాగునీటి సరఫరాలో, విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ టాప్లో నిలిచిందని మంత్రి చెప్పారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా తెలంగాణలో కష్టాలంటూ ఉండవని, భవిష్యత్లో రావని మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు.