బోథ్, ఏప్రిల్ 19: రసాయనిక ఎరువుల వాడకంతో భూసారం దెబ్బతిని పంట దిగుబడి తగ్గిపోతుండంతో అన్నదాతలు సేంద్రియ ఎరువుల వైపు మొగ్గు చూపుతున్నారు. పశువుల ఎరువును వాడుతూ, భూసార పరిరక్షణకు ప్రాధాన్యమిస్తున్నారు. వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచుతున్నారు. బోథ్ ప్రాంతంలో రైతులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గిస్తున్నారు. స్థానికంగా లభించే పశువుల పేడను సేంద్రియ ఎరువుగా వినియోగిస్తున్నారు. ఆవులు, గేదెలు, ఎద్దులతోపాటు మేకలు, గొర్రెల పేడను విరివిగా వాడుతున్నారు. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల నేలలో మిత్ర పురుగులు, వానపాములు వృద్ధి చెందడంతోపాటు సేంద్రియ కర్భనం పెరిగే వీలున్నందున వినియోగాన్ని ఏటా పెంచుతున్నారు.
నేలలో నీటి నిలువ సామర్థ్యం పెరగడంతో పాటు గుల్లగా మారి మొక్కల వేర్లకు గాలి ప్రసరణ సరిగా జరగడానికి వీలు కలగడం, మొక్కలకు మేలు చేసే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు వృద్ధి చెందడానికి దోహదపడుతుంది. పంటల పెరుగుదలకు వినియోగించే భాస్వరం, నత్రజని, పొటాష్ వంటి ఎరువులను కరిగించి మొక్కలకు అందిచడంలో సేంద్రియ ఎరువులు వాహకాలుగా పని చేస్తుండడంతో వాడకాన్ని పెంచుతున్నారు. పశు సంపద ఉన్న రైతులు సేకరించిన పేడను ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో పొలాలకు తరలిస్తున్నారు. కుప్పలుగా పోసి పొలమంతా వెదజల్లుతున్నారు. పశువులు లేని రైతులు ఇతర ప్రాంతాల నుంచి పేడను కొనుగోలు చేసి తీసుకొని వస్తున్నారు. లారీ పశువుల పేడకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ట్రాక్టర్ లోడ్ను రూ.3500 నుంచి రూ.5,000 వరకు కొనుగోలు చేసి తరలిస్తున్నారు.
ఎకరానికి 8 టన్నుల ఎరువు వాడాలి
దీర్ఘకాలిక పంటలైన పత్తి, కంది సాగు చేసే ఎకరానికి నాలుగు నుంచి 8 టన్నుల వరకు పశువుల ఎరువు వేయాలి. మూడు నెలల పంటలైన సోయాబీన్, శనగ, నువ్వులు, పెసర, మినుము వంటివి వేస్తే ఎకరానికి నాలుగు టన్నుల ఎరువు సరిపోతుంది. సేంద్రియ ఎరువుల వాడకం పెంచితే మొక్కలకు మేలుచేసే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు పెరిగి పంట దిగుబడులు పెరిగే అవకాశం ఉంది.