దహెగాం, ఏప్రిల్ 26 : వైరస్ కట్టడికి ప్రతిఒక్కరూ సహకరించాలని ఎంపీడీవో సత్యనారాయణ, ఇన్చార్జి వైద్యాధికారి చంద్రకిరణ్ అన్నారు. రాంపూర్, దిగడ, తదితర గ్రామాల్లో సోమవారం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాంపూర్, దిగడలో 40 మందిని పరీక్షించగా 8 మందికి, వివిధ గ్రా మాల్లో మరో ఏడుగురికి పాజిటివ్ వచ్చిందన్నారు. అలాగే మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 110 మందికి వ్యాక్సిన్ వేశామని తెలిపారు. సర్పంచ్లు కోవ కనకయ్య, ఎల్కరి యశోద, కార్యదర్శులు నరేశ్, విజయ్కుమార్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
శుభకార్యాలకు దూరంగా ఉండాలి ..
పెంచికల్పేట్ , ఏప్రిల్ 26 : వైరస్ ఉధృతి నేపథ్యంలో శుభ, ఆశుభ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని వైద్యాధికారి ముస్తఫా అన్నారు. మండలంలోని పోతపెల్లి, గుంట్లపేట గ్రామాల్లో సోమవారం వైద్య శిబిరాలు నిర్వహించారు. 40 మందిని పరీక్షించి మందులను అందజేశారు. అలాగే మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో 10 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చిందని, 30 మందికి వ్యాక్సిన్ వేశామని చెప్పారు. ఆయనతో పాటు ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
27 మందికి టీకాలు..
లింగాపూర్, ఏప్రిల్26 : మోతీపటార్ గ్రామానికి చెందిన 27 మందికి టీకా వేసినట్లు వైద్యాధికారి సంజీవ్ తెలిపారు. అదే విధంగా ఎల్లపటార్ గ్రామానికి చెందిన ప్రజలు సైతం గ్రామపంచాయతీలో కొవిడ్ పరీక్షలు చేసి అర్హత ఉన్నవారు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని కోరారు.
89 మందికి..
కెరమెరి, ఏప్రిల్26 : పీహెచ్సీలో సోమవారం 89 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి సుంకన్న తెలిపారు. టీకా పూర్తిగా సురక్షితమని 45ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా 25 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని ఆయన చెప్పారు.