హైదరాబాద్ : గొర్రెల యూనిట్ పెంచిన ధరను రూ. 1,75,000 గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే డీడీ లు కట్టి ఉన్న 14 వేల మంది అర్హులకు కూడా పెంచిన ధరను వర్తింపజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. రెండో విడత గొర్రెల పంపిణీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలోనే చేపట్టాలని ఆదేశించారు. రాజస్థాన్ను మించి షీప్ పాపులేషన్లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకున్నదన్నారు.
చేపల పెంపకం వృత్తిని నిర్వహించే బెస్తలు, గంగపుత్రులు, ముదిరాజ్ల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది అని సీఎం అన్నారు. మత్స్య సంపద రోజు రోజుకు అభివృద్ది చెందుతూ విస్తరిస్తున్నదన్నారు. కాళేశ్వరం తదితర ప్రాజెక్ట్ల నిర్మాణం తర్వాత తెలంగాణలోని రిజర్వాయర్లు నిండి చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నట్లు చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత చేపల పంపిణీ అద్భుత ఫలితాలను సాధిస్తున్నదన్నారు. ప్రతీ గ్రామం లోని చెరువులో మత్స్య సంపద పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిందని తెలిపారు. గతంలో ఇతర ప్రాంతాల్లో నుంచి తెలంగాణకు చేసుకునే చేపల దిగుమతి తగ్గిందన్నారు. చేపల పెంపకం సొసైటీ లో 18 ఎండ్లు నిండిన అర్హులైన యువకులకు అవకాశం కల్పించాలని సీఎం ఆదేశించారు.