నాగర్కర్నూల్/ హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ)/అచ్చంపేట: అతివేగం ఏడుగురిని బలిగొన్నది. దైవదర్శనానికి శ్రీశైలం వెళ్లొస్తున్న మిత్ర బృందం ప్రయాణిస్తున్న కారు వేగంగా ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టగా.. ఏడుగురు దుర్మరణం చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్లోని నిజాంపేటకు చెందిన వెంకటేశ్ (28), అతని మిత్రుడు సుచిత్ర ప్రాంతానికి చెందిన వంశీకృష్ణ (25), సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం గండిగూడంకు చెందిన నరేశ్ మరో ఇద్దరు మిత్రులతో కలిసి గురువారం మధ్యాహ్నం శ్రీశైలానికి కారులో వెళ్లారు. శుక్రవారం స్వామివారిని దర్శించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. హైదరాబాద్లోని మల్కాజిగిరి ఆర్కేనగర్ ప్రాంతానికి చెంది న సుబ్బలక్ష్మి, ఆమె కొడుకు శివకుమార్తోపాటు వారి దగ్గరి బంధువైన విశాఖపట్నం తునికికి చెందిన రాంమ్మూర్తి ఆయన కుమారుడు శివతో కలిసి శుక్రవారం శ్రీశైలానికి కారులో బయల్దేరారు. సాయంత్రం 6:30 గంటలకు నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం చెన్నారం-ఆవులోనిబావి వద్ద వీరు ప్రయాణిస్తున్న కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో సుబ్బలక్ష్మి, శివకుమార్, రామ్మూర్తి, శివతోపాటు మరో కారులో ఉన్న వంశీకృష్ణ, వెంకటేశ్ మరో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. అతివేగం కారణంగా కార్లు నుజ్జునుజ్జవ్వగా, మృతదేహాలు అందులోనే ఇరుక్కున్నాయి. పోలీసులు గంటపాటు శ్రమించి మృతదేహాలను వెలికితీసి అచ్చంపేటకు తరలించారు. తీవ్రంగా గాయపడిన నరేశ్ను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, కలెక్టర్ శర్మన్ చౌహాన్, ఎస్పీ సాయిశేఖర్, ఇతర అధికారులు ఘటనాస్థలికి చేరుకొన్నారు. కార్లలో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీశారు.
నాగర్కర్నూల్ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున అందజేయనున్నట్టు ప్రకటించారు.
ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సమాచారం తెలిసిన వెంటనే ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు ఫోన్చేసి, ప్రమాద పూర్వాపరాలను తెలుసుకున్నారు. క్షతగాత్రులకు వైద్యసేవలందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.