కోల్కతా : ప్రధాని నరేంద్ర మోదీపై పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శల దాడి తీవ్రతరం చేశారు. మోదీ అబద్దాల కోరని, రాష్ట్రంలోకి కాషాయ పార్టీ గూండాలను తీసుకువస్తోందని ఆరోపించారు. విష్ణుపూర్లో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి దీదీ మాట్లాడుతూ తాను ప్రధాని పీఠానికి గౌరవం ఇస్తానని, కానీ ప్రధాని మోదీ వంటి అబద్ధాలు చెప్పే వ్యక్తిని తాను ఇంతవరకూ చూడలేదని చెప్పారు. మోదీ కేవలం అసత్యాలే మాట్లాడతారని దీదీ మండిపడ్డారు.
బీజేపీ వేధింపులతో యూపీలో ఐపీఎస్ అధికారులు ఉద్యోగాలను విడిచిపెడుతున్నారని ఆరోపించారు. బెంగాల్ సంస్కృతిని నాశనం చేసేందుకు బీజేపీ యూపీ నుంచి రాష్ట్రానికి గూండాలను రప్పిస్తోందని దుయ్యబట్టారు. ఏడాదిగా రైతులు రోడ్లపై పోరు బాటలో ఉంటే వారిని రోడ్లపై నడవకుండా కేంద్రం చర్యలు చేపట్టిందని అన్నారు. మోదీ, అమిత్ షా, ఆదానీలు కుమ్మక్కై ఇవన్నీ చేస్తున్నారని మండిపడ్డారు. దేశ సంపద, ఉత్పత్తులను అదానీ దిగమింగుతూ మోదీ, షాలకు పంచుతున్నారని ఆరోపించారు. పౌరులందరి ఖాతాల్లో రూ 15 లక్షలు జమ చేస్తానని హామీ ఇచ్చిన మోదీ ఎవరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఈ డబ్బు మన ఖాతాల్లో జమ చేయలేదని, బీజేపీకి కూడా ఎవరూ ఓట్లు వేయవద్దని దీదీ కోరారు.