హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం అభాసుపాలవుతున్నది. పారదర్శకత కోసం తీసుకొచ్చిన ఆన్లైన్ ఆర్టీఐ పోర్టల్ పౌరుల పాలిట శాపంగా మారింది. సాంకేతిక లోపాలు, అధికారుల నిర్లక్ష్యం, ఎజెన్సీల నిర్వహణ వైఫల్యాలు ఆన్లైన్ ఆర్టీఐ దరఖాస్తుదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. గత రెండేండ్లలో ఆన్లైన్ ద్వారా సమాచారం కోరుతూ 17,805 దరఖాస్తులు వస్తే.. అందులో పరిష్కారమైనవి 377 మాత్రమే. అంటే కనీసం 2% దరఖాస్తులు కూడా పరిష్కారం కాలేదు. వీటికి తోడు మొదటి అప్పీలు చేసుకున్న 2,502 దరఖాస్తుల్లో కనీసం ఒకటి కూడా పరిషారానికి నోచుకోకపోవడం ఈ వ్యవస్థ ఎంతలా మొద్దుబారిందో స్పష్టం చేస్తున్నది.
రాష్ట్రంలోని 3,323 ప్రభుత్వ విభాగాలు ఆర్టీఐ పోర్టల్లో అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలో 17 విభాగాలు మాత్రమే నామమాత్రంగా సేవలు అందిస్తున్నాయి. సమాచార హక్కు చట్టం అమల్లో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను అర్బన్ డెవలప్మెంట్ ఫోరం (యూడీఎఫ్) తాజా గణాంకాలతో ఎండగట్టింది. రాష్ట్రంలో ఆర్టీఐ పోర్టల్ అస్తవ్యస్తంగా మారిందని, ఈ పోర్టల్ నిర్వహంలో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్ట్ సంస్థపై చర్యలు తీసుకోవాలని యూడీఎఫ్ కన్వీనర్ ఎం శ్రీనివాస్ శుక్రవారం ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబుకు లేఖ రాశారు.
ఏదైనా సమాచారం కోసం ఆర్టీఐ పోర్టల్ ఓపెన్ చేయగానే కష్టాలు మొదలవుతున్నాయని, సాంకేతిక సమస్యలతో నరకం కనిపిస్తున్నదని దరఖాస్తుదారులు చెప్తున్నారు. సక్రమంగా లాగిన్ అవ్వకపోవడం, దరఖాస్తులు తిరసరణకు గురవ్వడం, చెల్లింపులు పూర్తిచేసినా ధ్రువీకరణ రసీదు రాకపోవడం, మొబైల్ ఫోన్లకు ఓటీపీలు రాకపోవడం లాంటి సమస్యలు పీడిస్తున్నాయని వాపోతున్నారు. ఆ పోర్టల్ యూజర్ ఫ్రెండ్లీగా లేకపోవడంతో సమాచార హకును వినియోగించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీఐ పోర్టల్ నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం ఎస్ఆర్ఐటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆప్స్టీర్ టెక్ సొల్యూషన్ సంస్థలకు అప్పగించింది. మూడేండ్లకు గాను రూ.2.07 కోట్లు చెల్లించేలా ఆ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోగా.. ఇప్పటివరకు రూ.1.51 కోట్లు చెల్లింపులు జరిపింది.
దీంతో ఆర్టీఐ పోర్టల్ను సక్రమంగా నిర్వహించకుండా సమాచార హక్కును నీరుగారుస్తున్న ఆ సంస్థలపై చర్యలు చేపట్టకుండా బిల్లులు ఎందుకు చెల్లిస్తున్నారని, ఆ పోర్టల్లో తలెత్తుతున్న సమస్యలపై ప్రభుత్వం ఎందుకు సమీక్షించడం లేదని శ్రీనివాస్ మండిపడ్డారు. బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన ఆ సంస్థలకు ఇంకా గడువు పొడిగించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై వెంటనే స్వతంత్ర విచారణ జరిపి సదరు కాంట్రాక్టు సంస్థలతోపాటు వైఫల్యాలకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.