ఆమనగల్లు,మే 25 : ధాన్యం కొనుగోలును వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తిరుపతిరావు పేర్కొన్నారు. మంగళవారం ఆమనగల్లు, మాడ్గుల మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. రోహిణి కార్తె సమీపిస్తుండటంతో వర్షాలు పడే అవకాశం ఉందని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడువకుండా టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం ధాన్యం కొనుగోలు చేసి గడువులోగా రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. వానకాలం సాగు సమీపిస్తుండడంతో రైతులు పొలం పనుల్లో బిజీగా ఉంటారని త్వరతిగతిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను ముగించాలన్నారు.
గన్నీ బ్యాగుల కొరతను పరిష్కరిస్తాం..
ఆమనగల్లు, మాడ్గుల కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు హమాలీల కొరత ఉన్నదని సమస్యను పరిష్కరించాలని, ఆమనగల్లు ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆరువేల మెట్రిక్ ధాన్యం కొనుగోలుకు అనుమతులు ఇవ్వాలని ఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్ అదనపు కలెక్టర్కు విన్నవించారు. సానుకూలంగా స్పందించింన అదనపు కలెక్టర్ రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. అనంతరం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేశారు. ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ వెంకటేశ్ను అభినందించారు. అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్లు చందర్రావు, కృష్ణ, మాడ్గుల ఇన్చార్జి స్రవంతి పాల్గొన్నారు.
సమస్యలపై వినతి..
ప్రభుత్వ దవాఖానలో నెలకొన్న సమస్యలను పరిష్కారించాలని కోరుతూ కాంగ్రెస్ యువజన సంఘం నాయకులు అదనపు కలెక్టర్ తిరుపతిరావుకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆమనగల్లు బ్లాక్ మండలం నాలుగు మండలాల కూడలిలో ఉండడంతో నిత్యం కరోనా టెస్టుల కోసం ప్రజలు తరలివస్తున్నారన్నారు. టెస్టులు, వ్యాక్సినేషన్ సంఖ్య పెంచాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆమనగల్లు ప్రభుత్వ దవాఖాన స్థాయిని పెంచడంతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఇక్కడి నుంచి డిప్యూటేషన్పై వెళ్లిన సిబ్బందిని ఇక్కడే విధులు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్పందించిన అదనపు కలెక్టర్ సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణానాయక్, ఆలీం, శ్రీకాంత్ పాల్గొన్నారు.