వ్యర్థ పదార్థాల నుంచి విద్యుదుత్పత్తి సులభమేనని మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. సోమవారం మండలిలో సభ్యులు గంగాధర్ గౌడ్, నవీన్కుమార్, అలుగుబెల్లి నర్సిరెడ్డి అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ కేంద్రం నిబంధనల ప్రకారం 90.05 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులకు దరఖాస్తులు వస్తే 76 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. కేంద్ర నిబంధనలు కఠినంగా ఉండడంతో ఔత్సాహికులు వెనకడుగు వేస్తున్నారన్నారు.
పంజాబ్లో మాదిరిగా తెలంగాణలోనూ కేంద్రమే ధాన్యాన్ని కొనాలని వ్యవసాయమంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. పంజాబ్తరువాత విసృ్తతంగా వరి సాగయ్యేది తెలంగాణలోనేనని చెప్పారు. మండలిలో సభ్యుడు తేరా చిన్నపరెడ్డి అడిగిన ప్రశ్నకు జవావిస్తూ.. కేంద్రం ధాన్యం కొనుగోలు చేసే అంశం మీద మరి కొద్ది రోజులలో స్పష్టత వస్తుందని చెప్పారు.
తమ నియోజకవర్గం భౌగోళికంగా సముద్ర తీరానికి దగ్గరగా ఉండటంతో ఇక్కడ డ్రై పోర్టు ఏర్పాటు చేయాలని హుజూర్నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి విజ్ఞప్తి చేశారు. పరిశ్రమల శాఖపై శాసనసభలో జరిగిన చర్చలో పాల్గొన్న సైదిరెడ్డి మాట్లాడుతూ, తమ నియోజకవర్గం కృష్ణపట్నం పోర్టుకు దగ్గరగా ఉండటంతో డ్రైపోర్టు ఏర్పాటు చేయడానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని చెప్పారు.
చంచల్గూడ జైలును వికారాబాద్కు తరలించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేశామని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు. దేశంలోనే మోడల్ జైలుగా తీర్చిదిద్దేలా వరంగల్ సెంట్రల్ జైలును నిర్మించబోతున్నామని వెల్లడించారు. కొత్త కారాగారాల నిర్మాణంపై సభ్యుడు నవీన్కుమార్ అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ఖైదీలకు మానసిక పరివర్తన కోసం అనేక చర్యలు చేపడుతున్నామన్నారు.
తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల గురించి చర్చకు అవకాశం కల్పించాలని బీజేపీ సభ్యుడు రాజాసింగ్ కోరారు. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికి తాము కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.