మహబూబ్నగర్ : పేద వర్గాలు ఉన్నత వర్గాలతో సమానంగా అభివృద్ధి చెందాలంటే రిజర్వేషన్లు అవసరం అని చెప్పిన మొట్ట మొదటి వ్యక్తి మహాత్మ జ్యోతిబా పూలే అని ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన మహాత్మా జ్యోతి రావు పూలే 131వ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో ఉన్న పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ..రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కూడా పూలే ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగంలో బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించారని అన్నారు.
అట్టడుగున ఉన్న వర్గాల వారు అభివృద్ధి చెందాలంటే చదువు ఒక్కటే ముఖ్యమని తెలిపారు. 70 సంవత్సరాలు గడచినప్పటికి దేశంలో ఆర్థిక అసమానతలు పోలేదన్నారు. తెలంగాణ వచ్చాక పూలే ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 1000 గురుకులాలు ఏర్పాటు చేసిందన్నారు.
అంతేకాక అన్ని కులాలకు పునరుజ్జీవనం పోస్తూ పాఠశాలలు, హాస్టళ్లు నిర్మించామని, రాష్ట్ర రాజధానిలో సుమారు 3 వేల కోట్ల రూపాయలతో అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతి జిల్లాలో బి.సి స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
దేశంలో 70 కోట్ల బీసీ జనాభా ఉన్నప్పటికీ కేంద్రంలో బీసీ వర్గాలకు ప్రత్యేకించి మంత్రి త్వశాఖ లేకపోవడం, అఖిల భారత సర్వీసులలో నిబంధనలు పాటించకపోవటం బాధాకారమని అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెక్కెం జనార్దన్ రచించిన జ్యోతిబా పూలే జీవిత చరిత్ర పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad | కూకట్పల్లిలో రేవ్ పార్టీ భగ్నం..44 మంది యువకులు అరెస్ట్
Crime news | విద్యుత్ స్తంభాన్ని ఢీకొని దగ్ధమైన ఇసుక లారీ
పూలే ఆశయాలను కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ : మంత్రి ఎర్రబెల్లి