హైదరాబాద్ : చేపల ఉత్పత్తికి రాష్ట్రంలో పుష్కలంగా జలాశయాలు అందుబాటులోకి వచ్చాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. సోమవారం మంత్రుల నివాసంలో ఫిషరీస్ సైన్స్ విద్యార్థుల సంఘం ప్రతినిధులు వినోద్ కుమార్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ స్వరాష్ట్ర సాధన ద్వారానే పుష్కలంగా జలాశయాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో నామమాత్రంగానే జలాశయాలు ఉండటం వల్ల చేపల ఉత్పత్తికి అవకాశాలు లేకుండా పోయిందని తెలిపారు. కాళేశ్వరం రిజర్వాయర్ నిర్మాణంతో రాష్ట్రంలో నీటి వనరులు పెరిగాయని, కాళేశ్వరం నుంచి పలు జిల్లాల్లోని చెరువులలో నీటిని నింపడం వల్ల, మిడ్ మానేరు వంటి పలు ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంతో చేపల ఉత్పత్తులకు మార్గం సుగమం అయిందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 90 కోట్ల ఫిష్ సీడ్స్ ను జలాశయాల్లో విడిచి పెడుతుండగా రానున్న రోజుల్లో దీన్ని మూడు వంతులకు పెంచే అవకాశాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. తద్వారా చేపలను ఎగుమతి చేసే స్థాయికి త్వరలోనే చేరుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానాలతో అనేక రంగాలలో రాష్ట్రం ప్రగతి పథంలోకి పయనిస్తోందని ఆయన వివరించారు. స్థానికంగానే ఫిష్ సీడ్స్ ను ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకోనున్నామని ఆయన చెప్పారు. సరిహద్దు జిల్లాల నుంచి ఫిష్ సీడ్స్ కొనుగోలును దశల వారీగా తగ్గించుకుంటామన్నారు.
చేపల ఉత్పత్తులను మరింత పెంచేందుకు ఫిషరీస్ పట్టభద్రులు, డిప్లొమా హోల్డర్స్ సేవలను ఉపయోగించుకుంటామని వినోద్ కుమార్ తెలిపారు.
కార్యక్రమంలో ఫిషరీస్ సైన్స్ విద్యార్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీ. ప్రభాకర్, వర్కింగ్ అధ్యక్షుడు పీ. రమేష్, ఉపాధ్యక్షుడు ఎం. మురళీ, ప్రతినిధులు శ్రావ్య, ప్రియాంక, సమత, ఆశ్రిత, విశాల్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రేపటి నుంచి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
దళిత బంధు చరిత్రలో నిలిచిపోతుంది : ఎల్. రమణ
చరిత్రలో ఈరోజు.. 14 బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ
అక్రమంగా పట్టా చేసుకున్నాడని.. పంట పొలంలోనే కట్టేశారు
ఇల్లందకుంటలో దళితుల భారీ ర్యాలీ