హుజూరాబాద్, ఆగస్టు 22: బీజేపీ నేత ఈటల రాజేందర్కు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇంతకాలం ఆయన వెంట నడిచిన అనుచరులు ఒక్కొక్కరుగా బీజేపీని వీడుతున్నారు. తాజాగా కేడీసీసీ బ్యాంక్ వైస్చైర్మన్, ఇల్లందకుంట సింగిల్ విండో అధ్యక్షుడు పింగిళి రమేశ్ బీజేపీకి రాజీనామా చేశారు. అదేబాటలో సింగిల్ విండో డైరెక్టర్లు, ఇతర మాజీ ప్రజాప్రతినిధులున్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పింగిళి రమేశ్ బీజేపీకి రాజీనామా ప్రకటించారు. త్వరలో టీఆర్ఎస్లో చేరనున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. బీజేపీ సిద్ధాంతాలు నచ్చకనే ఆ పార్టీ నుంచి బయటికి వచ్చినట్టు తెలిపారు. మొదటినుంచి వామపక్ష భావజాలం ఉండటంతో బీజేపీలో ఇమడలేకపోయానని చెప్పారు. 2001లో విలాసాగర్ సర్పంచ్గా గెలిచిన నాటినుంచి మొన్నటి వరకు టీఆర్ఎస్లోనే కొనసాగానని, మే 14న ఈటలతో కలిసి బీజేపీలో చేరిన విషయాన్ని గుర్తుచేశారు. బీజేపీలో చేరినప్పటి నుంచి ఆ పార్టీ వ్యవహార శైలి నచ్చలేదని, అందుకే కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ మళ్లీ టీఆర్ఎస్లో కొనసాగేందుకు నిశ్చయించుకున్నానని తెలిపారు. దేశం గర్వించదగ్గ దళితబంధును ప్రకటించి దళితులందరికి ఆరాధ్య దైవంగా కేసీఆర్ మారారన్నారు. జమ్మికుంట మాజీ వైస్ ఎంపీపీ చుక్క రంజిత్కుమార్, ఇల్లందకుంట రామాలయ మాజీ చైర్మన్ మధుసూదన్రెడ్డి, మాజీ సర్పంచ్లు కుమారస్వామి, కాస శంకరయ్య, మాలహక్కుల పోరాటసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మ్యాకమల్ల రత్నం, సింగిల్ విండో డైరెక్టర్లు తిరుపతిరావు, తిరుపతిరెడ్డి, రవి, సత్యనారాయణరావు, జితేందర్రెడ్డి, సుధాకర్, బీజేవైఎం నేత చిరంజీవి కూడా బీజేపీకి రాజీనామా చేశారు.