నాగర్కర్నూల్ : మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలే సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక తిరుమల ఫంక్షన్ హాల్లో నాగర్కర్నూలు ఎంపీ రాములు
ఆధ్వర్యంలో జరిగిన జిల్లా అభివృద్ధి, పర్యవేక్షణ కమిటీ ( దిశ) సమీక్ష సమావేశానికి మంత్రి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులు కష్టపడి పండించిన పంటకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉండే పంటలను సాగు చేసే విధంగా వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పంట ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణా రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు.
ఈ సారి రైతులు పత్తిని అధిక మొత్తంలో సాగు చేసే విధంగా తదుపరి ప్రధాన క్రమంలో సన్న రకం వరి, పప్పు ధాన్యాలు, నూనె గింజలు సాగు చేసే విధంగా రైతు వేదికల ద్వారా అవగాహన కల్పించే లా చర్యలు తీసుకోవాలన్నారు. పంట మార్పిడి పై రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని సూచించారు. రైతు పెట్టుబడులు తగ్గించి లాభాలు అధికంగా ఉండే విధంగా కొత్త వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సారి దొడ్డు బియ్యానికి డిమాండు ఉండదు. కాబట్టి రైతులు గమనించి సన్న బియ్యం పండించే విధంగా చూడాలన్నారు.
అదేవిధంగా మార్చి లోపల యాసంగి పంట కోతకు వచ్చే విధంగా చూడాలని, ఇందుకు వరి సాగుకు విత్తనాలు చల్లడం వంటి విధానం పాటించే విధంగా వ్యవసాయ విస్తీర్ణాధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు. రసాయన ఎరువుల తగ్గింపు, సాగు విధానంలో మార్పుల వల్ల రైతులకు గిట్టుబాటు దొరుకుతుందన్నారు.
దేశంలో పప్పు ధాన్యాలు, నూనె గింజలు సరిపోకపోవడంతో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుందన్నారు. వీటిని మన రాష్ట్రంలోనే అత్యధికంగా సాగు చేసి దేశ ప్రజల అవసరాలు తీర్చే స్థాయికి ఎదగాలన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ పి. పద్మావతి, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ యల్. శర్మన్, అదనపు కలెక్టర్ మను చౌదరి హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
ములుగు జిల్లాలో బాలికపై లైంగికదాడి
టీకాల కొరత : కేంద్రంపై శివసేన ఎంపీ ఫైర్
ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
నిరు పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
నారింజ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద