నిర్మల్ : సారంగాపూర్ మండలం ప్యారముర్ గ్రామంలో రూ. 50 లక్షల వ్యయంతో చేపట్టిన సాయి బాబా ఆలయ అభివృద్ధి పనులకు దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని సాయి బాబాను దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలోని దేవాలయాలు సీఎం కేసీఆర్ కృషితో ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ పునర్నినిర్మాణం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. జిల్లాలో కొలువై ఉన్న బాసర జ్ఞానసరస్వతీ అమ్మవారి దేవాలయ అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను, కామన్ గుడ్ ఫండ్ నిధులతో ఇతర ఆలయాల జీర్ణోద్ధరణ, దేవాలయాల నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా దేవాలయాలకు నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మొక్కలు నాటారు.