హైదరాబాద్: కేసీఆర్ ప్రవేశపెట్టిన ఆసరా పథకం అవ్వా తాతలకే కాదు చివరకు గ్రామ పనులకు కూడా ఆసరైతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రంగారెడ్డి జిల్లా పోతుగల్లో 200 మంది పింఛన్ దారులు (వృద్ధులు) రూ.20 చొప్పున రూ.2 వేలు పోగేసి షాద్నగర్-చేవెళ్ల రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆసరా పథకం అసరవుతున్నదని ఎక్స్ వేదికగా కేటీఆర్ అన్నారు. రోడ్లు వేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవా అని ప్రశ్నించారు.
మాజీ సర్పంచుల సంగతి సరే చివరకు పంచాయతీ కార్యదర్శులు కూడా అప్పులపాలు కావల్సిందేనా రేవంత్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని, అలాంటి గ్రామాలను అభివృద్ధి చేయాలని కేసీఆర్ ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టిందని గుర్తుచేశారు. అంతటి గొప్ప కార్యక్రమం పల్లె ప్రగతిని అటకెక్కించారా మహానుభావ అంటూ విమర్శించారు.
ఆసరా పెన్షన్లు వృద్ధులకు సరైన సమయానికి అందక అల్లాడుతుంటే దాచుకున్న డబ్బుతో తప్పని పరిస్థితుల్లో రోడ్లు వేస్తున్నారని చెప్పారు. ఆసరా పెన్షన్తో దాతలుగా సహాయం చేస్తే తప్ప రోడ్లు వేయలేని పరిస్థితి నెలకొన్నదని వాపోయారు. ఎందుకు మీ పాలన, కొంచెం కూడా సిగ్గు అనిపిస్త లేదా అని విమర్శించారు. నమస్తే తెలంగాణ పత్రికలో ఆదివారం (సెప్టెంబర్ 29) ప్రచురితమైన వార్త క్లిపింగ్ను ట్వీట్ చేస్తూ.. ఈ చిత్రం చూసి తలకాయ ఎక్కడ పెట్టుకుంటావో ఆలోచించుకో అంటూ ఫైర్ అయ్యారు.
ఆసరైతున్న కేసీఆర్ ఆసరా పథకం
అవ్వా తాతలకే కాదు చివరకు గ్రామ పనులకు కూడా ఆసరైన ఆసరా పింఛన్
రోడ్లు వేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవా?
మాజీ సర్పంచుల సంగతి సరే చివరకు పంచాయతీ కార్యదర్శులు కూడా అప్పులపాలు కావల్సిందేనా రేవంత్
దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు.అలాంటి… pic.twitter.com/hgEqQTu3Zd
— KTR (@KTRBRS) September 30, 2024