కామారెడ్డి : వానకాలం సాగు కోసం నిజాం సాగర్ నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ..జూలైలో రైతులకు సాగు నీటిని అందించడం గొప్ప విషయమన్నారు. కాళేశ్వరం ద్వారా 1.5 టి.ఎం.సి.ల నీరు నిజాంసాగర్ లో కలపడం వలన ఇది సాధ్యమైందన్నారు. అవసరమైతే ఇంకో రెండు టీఎంసీల నీటిని ముఖ్యమంత్రి ఇస్తారన్నారు.
దేశంలో ఎక్కడ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా మన సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తున్నారని, ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ మంజూరు చేసి గ్రామాలలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామాల వికాసానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జుక్కల్ శాసన సభ్యుల కోరిక మేరకు నిజాంసాగర్ మండలం హాసన్ పల్లి గ్రామానికి సీసీ రోడ్ల,డ్రైన్స్ నిర్మాణాలకు 20 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
అంతకుముందు శాసనసభాపతి, మంత్రి హాసన్ పల్లి గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం గుల్ దస్తా గెస్ట్ హౌస్ ను పరిశీలించారు.
శాసన సభాపతి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలను మనమిప్పుడు చూస్తున్నామని, రాష్ట్రంలో కోటి 50 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించి రైతులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారని తెలిపారు.రైతాంగం నీటిని వృథా చేయకుండా వాడుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ శోభ, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, నిజాంసాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రిలో వైభవంగా లక్షపుష్పార్చన
ఆగని పెట్రో వడ్డన.. లీటర్పై 35 పైసలు పెంపు
హరితహారం దేశానికే స్ఫూర్తిదాయకం