హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): విజయవాడలోని దుర్గగుడిలో రెండోరోజూ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై గతనెలలో ఏసీబీ అధికారుల తనిఖీల నేపథ్యంలో ఇప్పుడు విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టడం చర్చనీయాంశమైంది. ఉదయం మొదలైన తనిఖీలు రాత్రి ఏడింటిదాకా కొనసాగాయి. అన్నదాన, పరిపాలన విభాగంతోపాటు ప్రొవిజన్స్ స్టోర్స్లోనూ తనిఖీలు చేపట్టారు. విజిలెన్స్ అధికారులు మూడుబృందాలుగా విడిపోయి విచారణ చేశారు. ముందుగా అన్నదాన విభాగానికి వెళ్లిన అధికారులు.. ఏఈవో వెంకటరెడ్డిని రికార్డులు, బిల్లులపై ఆరా తీశారు. గతనెలలో మంజూరైన బిల్లులు, కాంట్రాక్టర్లకు చెల్లింపులపై ప్రశ్నించారు. విజిలెన్స్ అధికారులు తనిఖీల నిమిత్తం బ్రాహ్మణవీధిలోని జమ్మిచెట్టు వద్ద ఉన్న కార్యాలయానికి వెళ్లినప్పుడు గతంలో సస్పెండైనవారిలో కొందరు విధులు నిర్వర్తిస్తూ కనిపించడంతో విస్మయానికి గురయ్యారు.