హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకంపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి తీరుకు నిరసనగా ఆదివారం హైదరాబాద్లోని తన స్వగృహంలో నిరసన దీక్ష చేపడుతున్నట్టు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకానికి తూట్లు పొడిచే విధంగా రేవంత్ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అణగారిన వర్గాలను మోసం చేస్తున్న రేవంత్ తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. దళితుల మీద ప్రేమ ఒలకబోసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకోవడాన్ని ఆయన ఖండించారు. ముందుగా ఉదయం 9 గంటలకు లిబర్టీ చౌరస్తాలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేదర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ఇంటివద్ద దీక్ష చేపడతానని మోత్కుపల్లి తెలిపారు.