దాన, ప్రకాశక గుణాలను కలిగింది దేవత. వేదం ప్రకారం పంచభూతాలు, తారకలతో కూడిన సూర్యచంద్రులు, ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులతోపాటు యజ్ఞం, విద్యుత్తు.. ఇలా మొత్తం 33 దేవతలు. ఒక్క జీవుడు తప్ప, తక్కిన దేవతలు జ్ఞానం లేనివి. అయినా, అవి లోకానికి చేస్తున్న ఉపకారం మాటలతో చెప్పలేనిది. సమస్త దేవతలు కొలువుదీరిన సభామండపమే ఈ భువనం. భువనాధిపతి పరమేశ్వరుడు. ఆయన దేవతలకే దేవత ‘దేవదేవుడు’. జడమైనా, చేతనమైనా దేవత దేవతే. మన శరీరంలో అన్ని దేవతలూ ఉన్నాయి. ఈ సృష్టి నిరంతరం సాగుతూనే ఉంటుంది. సృష్టిలో జీవుల కోసం జలాధిదేవతలు సదా సహకరిస్తూంటాయి. మనిషి ఒక దేవత. మనందరి మనుగడకు అందరు దేవతల సహకారం లభిస్తున్నది. మనిషికి మనిషి సహకారం ఎట్లా అవసరమో ఈ సర్వదేవతామయమైన ప్రపంచం సహకారం మానవునికీ తప్పనిసరి. చీకటిలో మనకు దీపం అవసరం, కనుక దీపమొక దేవత. దాహం వేస్తే నీరు అవసరమవుతుంది. నీరొక దేవత. జీవించడానికి గాలి అవసరం కనుక, గాలి ఒక దేవత. నివసించడానికి భూమి అవసరం కాబట్టి, భూమి ఓ దేవత. మాట్లాడటానికి శబ్దం కావాలి, శబ్దాన్ని గుణంగా కలిగిన ఆకాశమూ ఒక దేవతగా ఉపయోగపడుతున్నది. ఈ సృష్టిలో ప్రతి వస్తువూ దేవతా స్వరూపమే.
మనిషి ప్రతి వస్తువునూ ఉపయోగించుకొని తన కోర్కెలను తీర్చుకుంటున్నాడు. ప్రతి వస్తువూ దేవతా స్వరూపం అన్నప్పుడు దానగుణమో, ప్రకాశకత్వమో దాని లక్షణమని భావించాలి. విశ్వమంతా దేవతామయమే. ఈ విశ్వానికి అధిపతి పరమేశ్వరుడు. అతడే అన్ని దేవతలను ఆజ్ఞాపిస్తూ జీవకోటికి సుఖదుఃఖ రూపమైన అనుభవాన్నిస్తున్నాడు. దేవతగా గుర్తించే జీవుడు ఒక్కనికే తక్కిన దేవతలకు లేని తెలివి (జ్ఞానం) ఉంది. అందుకే, ఇతణ్ణి ‘చేతనుడు’ అంటారు. ఆశ్చర్యమేమంటే ఈ జగత్తు అంతా జీవుని ఉపభోగార్థమే ఏర్పడింది. జగత్తులో జీవులనేకం. కర్మలు చేస్తూ వాటి ఫలాలను అనుభవించేవారు జీవులు. జీవుల సుఖదుఃఖానుభవం కోసమే పరమేశ్వరుడు ఈ సృష్టిని సృష్టించాడంటే, జీవులకంటే అదృష్టవంతులు ఎవరుంటారు! 33 దేవతల్లో 32 దేవతలు జీవులకోసమే ఉన్నాయి. ఏ ఒక్క దేవత సహకారం మృగ్యమైనా జీవుని మనుగడ వ్యర్థమవుతుంది.
‘సహయజ్ఞాః ప్రజాః సృష్టా పురోవాచ ప్రజాపతిః
అనేన ప్రసవిష్యధ్వమ్ ఏషవో స్తిష్ట కామధుక్