మెదక్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): మెదక్ ఎంపీ స్థానానికి 54 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అందులో 53 మంది నామినేషన్లు సరిగా ఉన్నాయి. ఒక నామినేషన్ తిరస్కరించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సాధారణ ఎన్నికల పరిశీలకులు, ఆయా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల సమక్షంలో నామినేషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్ మాట్లాడుతూ ఈనెల 18 నుంచి 25 వరకు కొనసాగిన ప్రక్రియలో భాగంగా మొత్తం 54 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారన్నారు. ఇండింపెండెంట్ అభ్యర్థి కళ్లు నర్సింహులు గౌడ్ ఎన్నికల నియమావళి ప్రకారం కొత్త ఓటర్ల లిస్టు, ఫారం నంబర్, సీరియల్ నంబర్, ప్రపోజల్ సరైన పత్రాలు సమర్పించలేదని, అందుకే నామినేషన్ తిరస్కరించామన్నారు. ఉప సంహరణ ఫామ్లను 29వ తేదీలోగా అందజేయాలని సూచించారు.
నామినేషన్ వేసిన అభ్యర్థులు బ్యాంకు ఖాతా ఓపెన్ చేసి ఖర్చు చేయాలన్నారు. సభలు సమావేశాలు, ర్యాలీలు నిర్వహించినప్పుడు ముందుస్తు అనుమతి తీసుకోవాలన్నారు. నర్సాపూర్ ఆర్డీవో, కలెక్టరేట్లో పోస్టల్ ఓటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రఘునందన్ రావు (బీజేపీ), నీలం మధు(కాంగ్రెస్), వెంకట్రామిరెడ్డి (బీఆర్ఎస్)లపై క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. అనంతరం ఎన్నికల సాధారణ పరిశీలకుడు సమీర్ మాధవ్ కుర్త్కోటి మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని చెక్ పోస్టుల్లో తనిఖీలు, అభ్యర్థుల ఖర్చుల నమోదు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నామినేషన్ వేసిన అభ్యర్థులు పాల్గొన్నారు.
మెదక్ అర్బన్, ఏప్రిల్ 26: మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికలకు సంబంధించి ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీలు అభ్యర్థులు పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని మెదక్, నర్సాపూర్, సిద్దిపేట్, సంగారెడ్డి, గజ్వేల్, దుబ్బాక, పటాన్చెర్వు, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు సూచనలు, సలహాలు కోసం ఎన్నికల సాధారణ పరిశీలకుడు సమీర్ మాధవ్ కుర్త్కోటి 9652875704 నంబర్కు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ నంబర్ 9871794793కు ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, శాంతి భద్రతల సమస్యలు, సంబంధించి పోలీస్ పరిశీలకుడు రామేశ్వర్ సింగ్ నంబర్ 9414285888కు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు పరిశీలకులు జిల్లాలోనే ఉండి ఎన్నికల అన్ని అంశాలను పరిశీలిస్తారని తెలిపారు. ఫిర్యాదులుంటే వారి దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్ పేర్కొన్నారు.