వేళ కాని వేళ ఊరు దాటుతున్నాం.. పలికే మంత్రం హనుమంతం. నిద్రలో పీడకల వచ్చి ఉలిక్కిపడి లేచాం.. స్మరించే నామం శ్రీ ఆంజనేయం.మారుతి మననం.. బతుకును సరళం చేస్తుందని నమ్మకం. గ్రహబాధలు తొలగిస్తుందని విశ్వాసం. రామాయణంలో రాముడిని సంకటాలనుంచి గట్టెక్కించి విజయతీరాలకు చేర్చింది వీరాంజనేయుడే! అందుకే ఈ రామబంటు కోవెల లేని ఊరు ఉండదు. ఆ రాముడి అనుగ్రహానికీ వారధి హనుమయ్యే! రుద్రాంశ సంభూతుడిగా అవతరించిన జయ హనుమాన్.. సాధకులకే కాదు, సామాన్యులకూ మహా భగవాన్..
Hanuman | ‘భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జబ నామ సునావై’- తులసీదాస విరచిత హనుమాన్ చాలీసాలోని 24వ చౌపాయి ఇది. ‘మహావీరుడైన ఓ హనుమంతుడా! నీ నామం విన్నవెంటనే భూత పిశాచాలు మా దరిదాపుల్లోకి రావడానికి కూడా భయపడతాయి’ అని దీని అర్థం. మన మనసు ఆందోళనకు గురైనప్పుడు, మనం కలత చెందినప్పుడు ఇంట్లో పెద్దలు హనుమాన్ చాలీసా చదువుకోండి అని సూచిస్తారు. ఇలాంటప్పుడు ప్రధానంగా ఉచ్చరించేది ఈ ‘భూత పిశాచ నికట నహి ఆవై..’ చౌపాయినే. దీన్ని స్మరిస్తే మనకు భయాందోళనల నుంచి విముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు.
ఆధునిక మానసిక శాస్త్రం, వైద్యశాస్త్రం అభివృద్ధి చెందడానికి ముందు మనకేవైనా మానసిక సమస్యలు, రుగ్మతలు గనుక ఉంటే మన పూర్వికులు వాటిని భూతప్రేతాల నుంచి తలెత్తినవిగానే భావించేవాళ్లు. భూతాలు నిజంగానే ఉంటాయని నమ్మేవాళ్లు ఈ చౌపాయిని చదివితే అవి తమను విడిచిపెట్టి పోతాయని విశ్వసిస్తారు. అలా కాకుండా భూతప్రేతాలేవీ లేవు.. ఇవన్నీ మన భయాలే అనుకునే వాళ్లు కూడా… తమకు మనోబలం సమకూరడానికి హనుమాన్ చాలీసా పఠిస్తారు. ఈ నమ్మకం హనుమంతుడి నామస్మరణ గొప్పతనాన్ని వివరిస్తుంది. రాజస్థాన్ రాష్ట్రం మెహందీపూర్లో బాలాజీ హనుమాన్ దేవాలయం ప్రత్యేకమైనది. ఇక్కడి స్వామిని దర్శించుకుంటే భూతప్రేతాలు, దయ్యాల పీడ విరగడవుతుందని నమ్ముతారు.
సంకట మోచనుడు
హనుమంతుడు రామాయణంలో సీత జాడ కనిపెట్టి రాముడికి సహాయం చేశాడు. సంజీవ పర్వతాన్ని తెచ్చి లక్ష్మణుడిని ప్రాణగండం నుంచి కాపాడాడు. సాక్షాత్తు శ్రీరాముణ్నే పాతాళలోకంలో మహిరావణుడి నుంచి రక్షించాడు. కాబట్టి, దేవతలకే సహాయం చేసిన హనుమంతుడు తనను నమ్మిన భక్తులను కాపాడకుండా ఉంటాడా? అందుకే తులసీదాసు హనుమాన్ చాలీసా 36వ చౌపాయిలో… ‘సంకట కటై మిటై సబ పీరా/ జో సుమిరై హనుమత బలవీరా’ అని హనుమంతుణ్ని ప్రస్తుతించాడు. భారతదేశంలో ప్రతి గ్రామంలో, కొండకోనల్లో, రోడ్లవారగా, శ్మశానాల దగ్గర్లో ఆంజనేయుడి ఆలయాలు విస్తృతంగా దర్శనమిస్తాయి.
తమ ప్రయాణాలకు ముందు, ప్రయాణం పూర్తయిన తర్వాత హనుమంతుడికి మొక్కుకునే వాళ్లు చాలామందే కనిపిస్తారు. అంతేకాదు హనుమంతుడు అంటే నిబద్ధతకు మారుపేరు. ఒక కార్యం మొదలుపెట్టాడంటే ఎన్ని అవాంతరాలు వచ్చినా పూర్తి చేసేవరకు విశ్రమించడు. హనుమను జనం భక్తితో కొలవడానికి ఇది కూడా ఒక కారణం. ఇక కొన్ని కథల ప్రకారం… రావణాసురుడు శనేశ్వరుణ్ని, అంగారకుణ్ని, యమధర్మరాజును బందీలుగా ఉంచుకున్నాడట. వారికి హనుమంతుడే విముక్తి కల్పించాడట. అందుకే మంగళ, శనివారాల్లో హనుమంతుడి ఆరాధన విశేషంగా చేస్తారు. దీనివల్ల దురదృష్టం, కష్టాలు తమ దరిచేరవని నమ్ముతారు. ఇక యమధర్మరాజు అంశ బలంగా ఉండే రాత్రి వేళల్లో హనుమను పూజిస్తే భూతప్రేతాలు, ఇతర దుష్టశక్తుల బాధ తొలగిపోతుందని విశ్వసిస్తారు.
రోగ నాశకుడు
మానసిక ఆందోళనలు మాత్రమే కాదు శారీరక ఆరోగ్యాన్ని కూడా హనుమంతుడు సంరక్షిస్తాడు. వీరాధివీరుడైన ఆంజనేయుడు మన రోగాలు, బాధలను పారదోలి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అందుకే మల్లయోధులు, వ్యాయామంతో కండరాలు పెంచేవాళ్లు హనుమంతుణ్ని ఆరాధిస్తారు. అంతేకాదు మరణాన్ని తప్పించే సంజీవని పర్వతాన్ని తెచ్చిన కారణంగా హనుమంతుడు భారతీయ సంప్రదాయ వైద్యం ఆయుర్వేదంతో కూడా సంబంధం కలిగి ఉన్నాడు. మానసిక, శారీరక ఆరోగ్యాన్నిచ్చే యోగశాస్త్రంతోనూ ఆయనకు అనుబంధం ఉంటుంది.
తనకు విద్య నేర్పినందుకు సూర్యుడికి గౌరవ సూచకంగా సూర్య నమస్కారాలను మారుతే రూపొందించాడని అంటారు. మహారాష్ట్రలో ప్రాచుర్యంలో ఉన్న వ్యాయామ విద్య మల్లకంబ రూపశిల్పి కూడా ఆంజనేయుడే అని చెబుతారు. హనుమంతుడికి నివేదించే మినుములు, నువ్వులు, వెన్నలో ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తి పెంపొందడానికి, జీవక్రియలు ఉత్తేజితం కావడానికి, కీళ్లు సాఫీగా పనిచేయడానికి అవసరమైన పదార్థాలు కావడం విశేషం. తులసీ దాసు కూడా 25వ చౌపాయిలో ‘నాసై రోగ హరై సబ పీరా/ జపత నిరంతర హనుమత వీరా’ అని నుతించాడు. హనుమంతుణ్ని నిరంతరం స్మరించడం వల్ల రోగాలు నశించిపోతాయి. బాధలు తొలగిపోతాయి.
…?చింతలపల్లి హర్షవర్ధన్