హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీ నాయకులు కండ్ల ముందున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చూడలేని కబోదులని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యాలయం పక్కనే రెండు పడక గదుల ఇండ్లు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ (Telangana) రాష్ట్రం, ప్రజలు బాగుండాలని కోరుకునే గొప్ప మనసున్న నాయకుడు సీఎం కేసీఆర్ (CM KCR) అని తెలిపారు. నాలుగున్నరేండ్లుగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి (Kishan reddy) రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
45 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉండి రాష్ట్రానికి, ప్రజలకు ఏం ఒరగబెట్టారో చెప్పే దమ్ము కాంగ్రెస్ నాయకులు ఉందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, కేటీఆర్, హరీశ్ రావును విమర్శించడం దయ్యాలు వేదాలను వల్లించినట్లే ఉందని విమర్శించారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాయమాటలతో ప్రజల్లోకి వస్తున్నారని, డ్రామాలు షురూ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దళితబంధు (Dalitha bandhu) పథకం రానున్న రోజుల్లో దేశాన్నే కదిలిస్తుందని జోస్యం చెప్పారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో దళితబంధు అమలు చేయాలని డిమాండ్ మొదలైందన్నారు.