హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ధాన్యాన్ని కొనలేమని కేంద్రం చేతులెత్తేసిందని వెల్లడించారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ మాదాపూర్లో జరుగుతున్న వెజ్ ఆయిల్, ఆయిల్ సీడ్ రంగంపై గ్లోబల్ రౌండ్ టేబుల్ సదస్సుకు మంత్రి మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఆయిల్ ఉత్పత్తిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ప్రపంచానికి హైదరాబాద్ వ్యాక్సిన్ క్యాపిటల్గా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. లైఫ్సైన్సెస్ రంగంలో నగరం పురోగమిస్తున్నదని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలన్నీ హైదరాబాద్లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయని వెల్లడించారు. టీఎస్ ఐపాస్తో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు సులభతరం చేశామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. అమెజాన్ క్యాంపస్ ఏర్పాటుకు 11 రోజుల్లోనే అన్నిరకాల పర్మిషన్లు ఇచ్చామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరమని చెప్పారు. ఎనిమిదేండ్లలో తెలంగాణలో గ్రీన్ కవర్ 24 శాతం పెరిగిందన్నారు.
Minister @KTRTRS delivering keynote address at @IVPA_India’s Global Roundtable on Veg Oil and Oilseed Sector, in Hyderabad. https://t.co/O7NDOBQeqK
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 18, 2022
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ వ్యవసాయ విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని వెల్లించారు. తెలంగాణలో ఎక్కడికి పోయినా పచ్చని పంటలే కనిపిస్తున్నాయని తెలిపారు. భారతదేశంలో ఆయిల్ పంటల సాగుకు మనకు అన్ని వనరులు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఆయిల్పామ్ సాగు రైతులను ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.