హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): జాతీయస్థాయి పోటీ పరీక్షలను తెలుగు సహా ప్రాంతీయభాషల్లోనూ నిర్వహించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు కేంద్రాన్ని కోరారు. కేంద్రప్రభుత్వం నిర్వహించే అన్నిరకాల పరీక్షలను 12 ప్రాంతీయభాషల్లో నిర్వహించాలంటూ గతంలో కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు. హిందీ, ఇంగ్లిష్లో మాత్రమే పరీక్షలు నిర్వహించడంవల్ల ఇంగ్లిష్ మీడియంలో చదవనివారు, హిందీయేతర రాష్ర్టాలకు చెందిన అభ్యర్థులకు తీవ్ర నష్టం కలుగుతున్నదని పేర్కొన్నారు.
ఈ మేరకు ఆదివారం కేంద్ర సహాయమంత్రి జితేంద్రసింగ్కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. కేంద్ర సర్వీసులు, ఇతర శాఖలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకోసం యూపీఎస్సీతోపాటు ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు నిర్వహించే పోటీపరీక్షలకు దేశవ్యాప్తంగా లక్షల మంది పోటీ పడుతున్నారని తెలిపారు. వీటిని ఇంగ్లిష్, హిందీలో మాత్రమే నిర్వహించడం వల్ల ఇంగ్లిష్ మీడియంలో చదవనివారు, హిందీయేతర రాష్ర్టాల అభ్యర్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ర్టాలవారు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని వివరిస్తూ సీఎం కేసీఆర్ గతంలో ప్రధాని మోదీకి సైతం లేఖ రాశారని గుర్తుచేశారు.
క్యాబినెట్ నిర్ణయాన్ని అమలుచేయండి
ప్రత్యేకంగా జాతీయ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఏర్పాటుచేసి జాతీయస్థాయి పోటీపరీక్షలు, కేంద్రప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షలను 12 భారతీయ భాషల్లో నిర్వహించేందుకు కేంద్ర మంత్రివర్గం గతంలోనే నిర్ణయం తీసుకున్నదని.. ఈ విషయం తనకు తెలుసని మంత్రి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని అమలుచేయడంలో కేంద్రం తాత్సారం చేస్తున్నదని చెప్పారు. తాజాగా, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) ద్వారా కానిస్టేబుల్ నియామకాలు, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్మెన్ ఎగ్జామినేషన్ ద్వారా 25 వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి విడుదలచేసిన నోటిఫికేషన్లో హిందీ, ఇంగ్లిష్లో మాత్రమే పరీక్ష రాసేలా నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ నిబంధనతో హిందీయేతర రాష్ట్రాల అభ్యర్థులకు తీవ్రనష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. లక్షలమంది యు వత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అన్ని జాతీయస్థాయి ఉద్యోగాల భర్తీల్లో ప్రాంతీయభాషలకు అవకాశం కల్పించాలని కోరారు. తద్వారా అన్ని రాష్ర్టాల యువతకు సమాన అవకాశాలు లభిస్తాయిన వివరించారు. ఈ విషయంలో కేం ద్ర మంత్రిమండలి గతంలో తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలుచేయాలని విన్నవించారు. అన్ని ప్రాంతీయభాషల్లో పరీక్ష రాసే అవకాశం కల్పించేవరకు తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లను నిలిపివేయాలని డిమాండ్చేశారు.