Malakpet | మలక్పేట, మే 3: అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మలక్పేట పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు, హాస్టల్ విద్యార్థుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన యాకయ్య(19) సీతాఫల్మండిలోని ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ.. మలక్పేట ఏబీ కాలనీలోని సైదాబాద్ ఎస్సీ బాయ్స్ హాస్టల్లో ఉంటున్నాడు. శుక్రవారం కళాశాలకు వెళ్లి వచ్చిన యాకయ్య సాయంత్రం 6 గంటల సమయంలో వసతి గృహంలో ఖాళీగా ఉన్న చిన్న గదిలోకి వెళ్లి ఫోన్లో చాటింగ్ చేయడం చూసిన తోటి విద్యార్థులు పెద్దగా పట్టించుకోలేదు. కొద్ది సేపటి తర్వాత గదిలో పెట్టిన చార్జర్ను తీసుకునేందుకు మరో విద్యార్థి వెళ్లగా.. తలుపులు మూసి గడియ పెట్టి ఉంది. తలుపును తట్టగా లోపలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. బలవంతంగా తలుపులు తీసి చూడగా.. యాకయ్య టవల్తో సీలింగ్కు వేలాడుతూ కనిపించాడు. దీంతో భయాందోళనకు గురైన తోటి విద్యార్థులు వెంటనే కత్తెరతో టవల్ను కత్తిరించి.. కిందకు దింపి విషయాన్ని హాస్టల్ వార్డెన్కు, పోలీసులకు, విద్యార్థి కుటుంబ సభ్యులకు చెప్పారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు విద్యార్థులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.
విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని, రూ.20లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వాలని, బలవన్మరణంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషలిస్టు విద్యార్థి సంఘం అధ్యక్షుడు నక్క వెంకటేశ్, మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు చిట్టుపాక ప్రభాకర్ డిమాండ్ చేశారు.