KTR | వరంగల్ : సింగపూర్, జపాన్ మాదిరిగా మనం కూడా ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఎదగాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. హనుమకొండ జిల్లాలోని మడికొండ ఐటీ పార్కులో రూ. 40 కోట్లతో అభివృద్ధి చేసిన క్వాడ్రెంట్ ఐటీ కంపెనీని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు.. ఎందుకంటే వరంగల్లో చదువుకున్నా.. భీమవరంలో చదువుకున్నా.. నెల్లూరులో చదువుకున్నా.. కర్నూల్లో చదువుకున్నా.. కరీంనగర్లో చదువుకున్నా.. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడ చదువుకున్నా.. అల్టిమేట్గా ప్రతి ఒక్కరిలో ఒక సత్తా, సామర్థ్యం ఉంటుంది. అది హైదరాబాద్లో చదువుకున్నవాళ్లే గొప్పవాళ్లు.. బెంగళూరులో చదువుకున్న వాళ్లే గొప్పవాళ్లు.. ఢిల్లీ, బాంబే ఐఐటీల్లో చదువుకున్నవాళ్లే గొప్పవాళ్లు.. అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇవాళ మీరు ప్రపంచంలో ఎక్కడికి పోయినా, అక్కడ ఉండే పారిశ్రామికవేత్తలను కలిసినా.. వారి గమ్యం, లక్ష్యం ఏంటి..? వాటిని సాధించారా? ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎట్ల అధిగమించి ముందుకు పోయారనేది అర్థమవుతుందని కేటీఆర్ తెలిపారు. 25 సంవత్సరాల క్రితం దేశంలో ఒక డిజిటల్ రెవల్యూషన్ ప్రారంభమైందని ఆయన గుర్తు చేశారు. కొత్తగా వచ్చిన ఇంజినీరింగ్ కాలేజీలు, సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన ఇన్స్టిట్యూట్స్ వల్ల భారతదేశంలో ఒక విప్లవం ప్రారంభమైంది. నాడు వైటుకే కంపెనీ వల్ల ఉపాధి అవకాశాలు లభించాయని మంత్రి తెలిపారు.
మన దేశం పెద్ద ఎత్తున యువతతో కూడుకున్నది.. 27 ఏండ్ల కంటే తక్కువ వయసున్న వారు 50 శాతం ఉన్నారు. 35 ఏండ్లు లోపు వారు 65 శాతం ఉన్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 1970, 80లో అధిక జనాభా మనకు నష్టం చేకూరుస్తుందన్నారు. కానీ ఇవాళ అదే జనాభా, అవే మానవ వనరులు భారతదేశానికి పెద్ద ఆయుధమైంది. వైటుకే నుంచి నేటి వరకు భారతదేశం పురోగతి చెందుతుందంటే దానికి కారణం ప్రభుత్వాలు కాదు.. మన దగ్గరున్న మానవ వనరులు. మనిషి బుర్రకు ఎంత పదును పెడితే, ఎంత బాగా వాడగలిగితే ఎన్ని అద్భుతాలైనా సృష్టించే అవకాశం ఉంది. దీనికి గొప్ప ఉదాహరణ.. మన కండ్ల ముందే ఉంది. సింగపూర్, జపాన్.. ఈ దేశాలకు వెళ్తే ఆశ్చర్యం అనిపిస్తది. మానవ వనరులు తప్ప ప్రకృతి ఇచ్చిన వనరులు ఆ దేశాల్లో లేవు. ఇవాళ ప్రపంచాన్ని శాసించే శక్తులుగా ఎదిగాయి. కేవలం బ్రెయిన్ పవర్తో మాత్రమే. అదే పద్ధతుల్లో భారతదేశంలో ఒక విప్లవం రావాలి. మనం కూడా ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఎదగాలంటే.. మన దగ్గర ఉండే అతిపెద్ద శక్తి, ఇంధనం మన యువత. వీరిని బెంగళూరు, పుణె, చెన్నైకి పరిమితం చేస్తే ఎలా.? ముఖ్యంగా 25 ఏండ్లలో ఐటీ రంగంలో వచ్చిన విప్లవం చూస్తే.. ఎన్నో అద్భుతాలు సృష్టించారు. చంద్రయాన్ పంపుతున్నాం. చంద్రుని మీద పరిశోధనలు చేసే స్థాయికి ఎదిగాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
దేశానికి మంచి జరగాలంటే పిల్లలకు ఉపాధి అవకాశాలు రావాలి. ఎక్కడి వారికి అక్కడ రావాలి. వరంగల్ ఎన్నారైలు కూడా ముందుకు రండి. మీకు కూడా స్థలాలు ఇస్తాం. మీరు కూడా క్యాంపస్లు పెట్టి వరంగల్ పిల్లలకు అవకాశం కల్పించండి. అందర్నీ బ్రహ్మాండంగా కలుపుకొని ముందుకు పోవాలి. రాబోయే పదేండ్లలో హైదరాబాద్, వరంగల్కు తేడా ఉండదు. ఐటీ రంగంలో భవిష్యత్ అంతా టైర్ 2 నగరాలదే. వరంగల్లోనే కాదు ఏపీలోని భీమవరం, నెల్లూరుకు కూడా ఐటీ సంస్థలు రావాలి. అక్కడా ఐటీ సంస్థలను పెట్టాలని ఎన్నారైలను కోరుతున్నాను. కావాలంటే జగనన్నకు చెప్పి నేను మీకు జాగా ఇప్పిస్తాను. బెంగళూరు ఐటీ రంగంలో 40 శాతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వారే ఉన్నారు. అక్కడి నుంచి వచ్చేందుకు తెలుగు ఐటీ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ఉన్నచోటే యువతకు ఉపాధి దక్కాలి. కులం, మతం పేరుతో కొట్టుకుచావడం మానాలి అని కేటీఆర్ అన్నారు.
🎉 Telangana Tier-II Cities Join State’s IT Growth Story
IT Minister @KTRBRS along with Ministers @EDRBRS, @Satyavathi_BRS inaugurated the Global Development Centre of Quadrant Technologies in Warangal.
The Development Centre, spread in an expansive 50,000 sq. ft. space, serves… pic.twitter.com/jPgdNDuCML
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 6, 2023