హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల(BC Gurukulam) సంస్థ విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో( 10th class results) అత్యుత్తమ ఫలితాలను సాధించి రికార్డు సృష్టింటారు. బీసీ గురుకుల విద్యార్థులు 98.25 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర సగటు కంటే 6.94 ఎక్కువ ఉత్తీర్ణత శాతం నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 261 పాఠశాలల విద్యార్థులు పరీక్షలు రాయగా 153 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా 391 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించి తమ ప్రతిభను చాటారు.
ఈ ఏడాది 17,845 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాయగా వారిలో 17,533 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వారిలో 8,853 మంది బాలికలు, 8,680 మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, బోధనా సిబ్బందిని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ గురుకుల సోసైటీ కార్యదర్శి బడుగు సైదులు అభినందించారు.