హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆనికట్కు సంబంధించి నిపుణుల కమి టీ చేసిన సిఫారసులను ఆమోదించడంతోపాటు, వాటిని తక్షణం అమలు చేయాలని తెలంగాణ సర్కార్ కోరింది. తుంగభద్ర జలాలపై ఏర్పాటుచేసిన హైపవర్ కమిటీకి విన్నవించింది. తుంగభద్ర జలాల నీటి వినియోగం, బేసిన్ రాష్ర్టాల మధ్య నెలకొన్న వివాదాలు, సమస్యల పరిష్కారం కోసం కేంద్రం ఇటీవలనే తొమ్మిది మందితో హైపర్ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ చైర్మన్, సీడబ్ల్యూ సీ చీఫ్ ఇంజినీర్ సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి వర్చువల్గా తొలిసారి సమావేశాన్ని నిర్వహించారు.
ఈ భేటీలో తుంగభద్ర రిజర్వాయర్లో పూడిక స్థాయి, తద్వారా తగ్గిన నీటినిల్వ సామర్థ్యం, సాగు, తాగునీరు, జలవిద్యుత్తు ఉత్పత్తిపై పడే ప్రభావం, పూడిక తొలగింపు సాంకేతిక, ఆర్థిక అంశాలు, నివారణ మార్గా లు, నావలి రిజర్వాయర్ నిర్మాణ ఆవశ్యకత, దిగువ రాష్ర్టాల నీటి వాటాకు కలిగే నష్టం, ఆర్డీఎస్ సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణ అధికారులు ఆర్డీఎస్కు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించా రు. ఆర్డీఎస్ ఆనికట్కు సంబంధించి గతంలో నియమించిన నిపుణులు కమిటీ పలు సూచనలు చేసిందని, ఆధునికీకరణ పనులకు సైతం మార్గదర్శకాలు జారీ చేసిందని గుర్తుచేశారు. ఆ కమిటీ నివేదికను హైపవర్ కమిటీ ఆమోదించడంతోపాటు, వాటిని అమలుకు చర్యలు చేపట్టాలని కోరారు. హైపవర్ కమిటీ భేటీలో తుంగభద్ర జలాశయంలో పూడిక సమస్యపై కూడా చర్చించారు. దీనిపై 15 రోజుల్లోగా పూర్తి అభిప్రాయాలు వెల్లడిస్తామని తెలిపారు. భేటీలో తెలంగాణ నుంచి ఈఎన్సీ రమేశ్బాబు, ఇంటర్స్టేట్ అధికారులు వర్చువల్గా పాల్గొన్నారు.