హైదరాబాద్ : రాష్ట్రంలో మతం పేరిట ఎవరైనా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. కులం, మతం పేరు మీద రాజకీయం చేసే విధ్వంసకర శక్తులను, చిల్లరమల్లర వ్యక్తులను ఒక కంట కనిపెట్టాల్సిన అవసరం ఉందని కేటీఆర్ సూచించారు.
హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో రూ. 495 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్లోనే కాదు, రాష్ట్రంలో కూడా మతం పేరిట రాజకీయాలు చేయలేదు.. పనికిమాలిన పంచాయతీలు లేవు అని స్పష్టం చేశారు. కులాలు, మతాల పేరిట ప్రజల మధ్య చిచ్చు పెట్టలేదు. ఆ చిచ్చులో చలిమంటలు కాచుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు.. చేయబోమని తేల్చిచెప్పారు. కొన్నేండ్ల క్రితం హైదరాబాద్లో ప్రతి ఏడాది ఐదు నుంచి పది రోజుల పాటు కర్ఫ్యూ విధించేవారు. కానీ కేసీఆర్ నాయకత్వంలో శాంతిభద్రతలను పటిష్టంగా కాపాడుకుంటున్నామని తెలిపారు. మతం పేరిట ఎవరైనా చిచ్చు పెట్టే ప్రయత్నం చేసినా ఉక్కుపాదంతో అణచివేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఒకే ఒక్క రోజు రూ. 495 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నామని కేటీఆర్ తెలిపారు. ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అనే తేడా లేకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం. గతంలో మోజాం జాహీ మార్కెట్ను చూసి బాధపడేవాళ్లం. ఇప్పుడు మోజాం జాహీ మార్కెట్ను అభివృద్ధి చేశామన్నారు. కులీకుత్బ్షా అర్బన్ డెవలప్మెంట్కు పూర్వ వైభవం తీసుకువస్తాం. వారసత్వ సంపదను కాపాడుకుంటామని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇప్పుడు ఏ ఎలక్షన్స్ లేవు. ఏ ఎన్నికలు లేకపోయినా.. రూ. 495 కోట్లతో ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టామంటే.. పాతబస్తీ అభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. కొన్ని మెట్రో నగరాల్లో తాగునీటికి కష్టాలు ఉన్నాయి. హైదరాబాద్లో మాత్రం తాగునీరు, విద్యుత్కు ఇబ్బంది లేదన్నారు. పాతబస్తీలో అవసరమైన చోట రోడ్లను విస్తరిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్లోని పాతబస్తీతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న నోటరీ సమస్యను పరిష్కారిస్తామని కేటీఆర్ తెలిపారు. జీవో నం 58, 59 తెచ్చి లక్ష మందికి హైదరాబాద్లో పట్టాలు ఇచ్చామని గుర్తు చేశారు. ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని అభివృద్ధి చేస్తున్నాం. పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా ప్రజలకు ఈ హాస్పిటల్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లో ప్రభుత్వ వైద్య సదుపాయాలను పెంచుతున్నామని కేటీఆర్ తెలిపారు.
MA&UD Minister @KTRTRS inaugurated the 690 meter long Bahadurpura Flyover today. Home Minister @mahmoodalitrs, MP @asadowaisi, MLA Moazzam Khan, MLC @SurabhiVaniDevi and others participated. pic.twitter.com/Lg3dmEbOsX
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) April 19, 2022