Covid-19 | గత కొన్ని నెలలుగా కొవిడ్ శాంతించింది. తాజాగా మరోసారి విజృంభిస్తున్నది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల వ్యర్థ నీటిలో కొవిడ్ ఆనవాళ్లను గుర్తించారు. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) నివేదిక వెల్లడించింది. దీనికి ‘ఫ్లిర్ట్’ (FLiRT) నామకరణం చేశారు. అమెరికా, సింగపూర్ సహా అనేక దేశాల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అయితే, వేగంగా పెరుగుతున్న ఇన్ఫెక్షన్ కారనంగా సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని మరోసారి విజ్ఞప్తి చేసింది. సీడీసీ నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 14 నుంచి 27 వరకు అమెరికాలో దాదాపు 25శాతం కేసులకు కేపీ.2 సబ్ వేరియంట్ కారణంగా పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా జేఎన్.1, కేపీ.1, కేపీ.2 ఉప వేరియంట్లు విస్తరిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ప్రస్తుతం సింగపూర్లో మూడింట రెండువంతుల కంటే ఎక్కువ కేసులు కేపీ.1, కేపీ.2 వేరియంట్ కేసులున్నాయి. ఈ వేరియంట్ ఒమిక్రాన్ను పోలి ఉంటుంది. వేగంగా సోకుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. వ్యాక్సిన్ ద్వారా శరీరంలో ఉత్పత్తయిన యాంటీబాడీలను సైతం తప్పించుకుంటాయని తెలిపారు. సీడీసీ డేటా ప్రకారం ఫ్లిర్ట్ వేరియంట్.. కేజీ.1.1, కేపీ.2 వేరియంట్లు ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. రెండు వారాల వ్యవధిలో ఈ వైవిధ్యం కారణంగా సంక్రమణ కేసులలో చాలా వేగంగా పెరుగుదల ఉందని గుర్తించారు. అమెరికాలోని యేల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్ మేగాన్ ఎల్ మాట్లాడుతూ ఫ్లిర్ట్లో కొన్ని ఆందోళనకరమైన లక్షణాలు కనిపించాయని నివేదికలో పేర్కొన్నారు.
స్పైక్ ప్రోటీన్లో మార్పులు ఉన్నాయని.. ఇవి సులభంగా మానవ శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్కు కారణమవుతాయి. మీడియా నివేదికల ప్రకారం.. సింగపూర్లో కొవిడ్ కొత్త వేవ్ కనిపిస్తున్నది. మే 5 నుంచి 11 వరకే 25,900 కంటే ఎక్కువగానే కేసులు రికార్డయ్యాయి. ఈ క్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి ఒంగ్ యే కుంగ్ ప్రజలు మరోసారి మాస్క్లు ధరించాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ కొత్త దశ ప్రారంభంలో ఉన్నామని.. కేసులు నిరంతరం భారీగా పెరుగుతున్నాయని.. వచ్చే రెండు, నాలుగు వారాల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని మరోసారి మాస్క్లు ధరించడం అలవాటు చేసుకోవాలని, తద్వారా వైరస్ని నియంత్రించవచ్చన్నారు.
జూన్ నెలాఖరు వరకు ప్రతి ఒక్కరూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం కొనసాగించాల్సిన ఉందన్నారు. కొత్త వేరియంట్ ఫ్లిర్ట్ కేసులు భారత్లోనూ నమోదయ్యాయి. ఇప్పటి వరకు 250 వరకు కేసులు నమోదయ్యాయని తెలుస్తున్నది. మహారాష్ట్రలోనే కేపీ.2కి చెందిన 91 కేసులను గుర్తించారు. రాష్ట్రంలోని కరోనా కేసుల పెరుగుదలనుసూచిస్తుంది. మే 15 వరకు పూణేలో అత్యధికంగా 51 మందికి ఈ కొత్త వేరియంట్ సోకింది. 20 కేసులతో థానే రెండో స్థానంలో ఉంది. అమరావతి, ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాల్లో ఒక్కొక్కటి ఏడు కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా.. సీడీసీ నిపుణుల లెక్కల ప్రకారం.. సెప్టెంబర్ 2023 నుంచి కేవలం 22.6శాతం వరకు మాత్రమే వయోజనులు వ్యాక్సిన్ పొందారు.