అమరావతి : ఏపీలోని పల్నాడులో పోలింగ్ రోజున, తరువాత జరిగిన అల్లర్ల వెనుక చంద్రబాబు(Chandra Babu) కారణమని మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) ఆరోపించారు. నియోజకవర్గంలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ జరుపుతున్న సిట్ బృందాన్ని(SIT Team) కలిసి పలు అంశాలను వివరించి ప్రతిపక్ష నాయకులు, పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. పోలింగ్రోజున బందోబస్తులో పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మట్లాడారు.
ఎన్నికల్లో ఓడిపోతున్నామన్న పరిస్థితుల్లో చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తారని ఆరోపించారు. దాడుల వెనుక చంద్రబాబు, పవన్, పురందేశ్వరి కుట్రలు చేశారనే అనుమానాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సత్తెనపల్లి నుంచి మూడుసార్లు పోటీ చేశానని, ఇలాంటి హింసాత్మక (Violence) ఘటనలు ఏనాడు చోటుచేసుకోలేదని అన్నారు. పోలింగ్, పోలీసు సిబ్బంది కొంతమంది టీడీపీ నాయకులకు డబ్బులకు లొంగిపోయారని ఆరోపించారు.
సత్తెన్నపల్లి నియోజకవర్గంలో కూటమి నాయకులు బూత్లను ఆక్రమించుకుని దొంగ ఓట్లు వేశారని విమర్శించారు. హింసాత్మక ఘటనల్లో తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని సిట్ను కోరినట్లు తెలిపారు. కూటమి నాయకుల భయంతో కొండాపిలిలో ముస్లిములు ఇళ్లు వదిలి పోయారు, గ్రామాలు విడిచి వెళ్లినవారిని తిరిగి రప్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. ఎన్నికుట్రలు చేసినా వైఎస్ జగన్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని ధీమాను వ్యక్తం చేశారు.