Srishailam : ద్వాదశ జ్యోతిర్లంగ క్షేత్రమైన శ్రీశైలం ఆలయానికి ఆదివారం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. విద్యార్థులకు వేసవి సెలవులు కావడం.. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు ఆదివారం సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు.
ఆన్లైన్ ద్వారా టికెట్లు పొందిన భక్తులు శ్రీమల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. సాధారణ భక్తులు స్వామివారి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో టోల్గేట్ మలుపు వద్ద ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
పెద్ద ఎత్తున వచ్చిన వాహనాలను శివపార్వతుల విగ్రహాల వద్ద నిలిపి వేయడంతో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రద్దీ రోజుల్లో ట్రాఫిక్ సమస్యను చక్కదిద్దడంతోపాటు, ఇలాంటి సమస్యలు మళ్లీమళ్లీ తలెత్తకుండా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.