నల్లగొండ : జిల్లాలోని నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియాకు సీఎం కేసీఆర్ ఆగస్టు 2న సీఎం కేసీఆర్ విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి గురువారం పరిశీలించారు. నియోజకవర్గ ప్రగతి సమీక్ష నిర్వహించేందుకు, సమావేశ నిర్వహణకు ప్రభుత్వ ఐ.టి.ఐ., మార్కెట్ యార్డ్ ను స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డి.ఐ.జి. ఏ.వి.రంగనాథ్, అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసన సభ ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి హాలియాకు విచ్చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హామీల అమలు, నియోజక వర్గం ప్రగతి సమీక్షను సీఎం నిర్వహిస్తారన్నారు. నియోజక వర్గంలో సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, దీర్ఘకాలిక సమస్యలుపై వార్డు సభ్యులు, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీలు, అధికారులతో సీఎం సమీక్షించి సలహాలు, సూచనలు, దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు.