సిద్దిపేట: కాళేశ్వరం జలాలతో రాష్ట్రంలోని భూ ఉపరితల సాగునీటి పరిమితి పెరిగిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను తలదన్నేలా తెలంగాణలో ధాన్యం పండిందని చెప్పారు. జిల్లాలోని నంగునూర్ మండలం మగ్దుంపూర్లో ఆయిల్ పామ్ సాగుకు మంత్రి శ్రీకారం చుట్టారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మొదటి ఆయిల్ పామ్ మొక్కను నాటారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రైతుల జీవితాలు బాగుపడతాయని కేసీఆర్ గతంలో చేప్పిన మాట నేడు నిజమయ్యిందని చెప్పారు. రైతులు చినిగిన పంచెలు కాదు పట్టు పంచెలు కట్టుకునే రోజులను సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని వెల్లడించారు. గతంలో మొగులుకు ముఖం పెట్టినా నీళ్లు వచ్చేవి కాదని.. కానీ నేడు సీఎం కేసీఆర్ ముఖం చూస్తే గోదావరి జలాలు గలగలా పారుతున్నాయని చెప్పారు.
ప్రతి సంవత్సరం రూ.90 వేల కోట్ల పామాయిల్ను విదేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్నదని, దీనిని నియంత్రించాలంటే మన దేశంలో సుమారు 70 లక్షల ఎకరాల్లో పామాయిల్ తోటలను సాగు చేయాలని తెలిపారు. పామాయిల్కు బహిరంగ మార్కెట్లో పుష్కలమైన డిమాండ్ ఉందని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర అందించేలా, అన్ని రకాల ప్రోత్సాహకాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.
తెలంగాణ వ్యవసాయంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నారని చెప్పారు. గతంలో ఈ ప్రాంత రైతులను చూసి నవ్విన ఆంధ్రా పాలకులు.. నేడు ఈర్ష్య పడుతున్నారని వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు ఏనాడైనా రైతుల గురించి పట్టించుకోలేదని, సాగునీటి గురించి ఆలోచించలేదని విమర్శించారు.