హుజూరాబాద్ : త్వరలో జరగబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికలో రెండు గుంట భూమి ఉన్న సామాన్యుడి, 200 ఎకరాల ఆసామి మధ్యనే పోటీ ఉంటుందని హరీశ్రావు చెప్పారు. ఎకరం అమ్మి ఎన్నికల్లో గెలుస్తానన్న ఈటలకు మద్దతు తెలుపుతారో.. ఎకరం కూడా లేని ఉద్యమ నాయకుడికి ఓటు వేసి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తారో ప్రజలే తేల్చాలన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంటలో ఏర్పాటు చేసిన ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్రావు పాల్గొని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు మద్దతుగా ప్రసంగించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో శ్రీనివాస్ యాదవ్ చురుకైన పాత్ర పోషించి.. రాష్ర్ట సాధనకు కృషి చేశారని కొనియాడారు. ఉద్యమంలో భాగంగా అనేకసార్లు జైలుకు వెళ్లివచ్చారని గుర్తు చేశారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్కు కేసీఆర్తో పాటు తామంతా అండగా ఉంటామని తేల్చిచెప్పారు. హుజూరాబాద్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని, టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని మంత్రి హరీశ్రావు కోరారు.
ఓటమి భయంతోనే ఈటల రాజేందర్ పరుష పదజాలం ఉపయోగిస్తున్నారని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. బీజేపీలోకి వెళ్లిన ఈటల రాజేందర్ కొత్త భాష నేర్చుకుని, తండ్రి లాంటి కేసీఆర్ను రా అని సంబోధిస్తున్నారు. తనను ఓరేయ్ హరీశ్ అని వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయ ఓనమాలు నేర్పి, ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి, రెండుసార్లు మంత్రి పదవి ఇచ్చిన కేసీఆర్ను అలా సంబోధించడం సరైంది కాదన్నారు. ఈటల ఎలాంటి పదజాలం వాడినా.. తాము మాత్రం రాజేందర్ను గౌరవంగా పిలుస్తామని తెలిపారు. ఓటమి భయంతోనే మాటలు తూలుతున్నారని హరీశ్రావు మండిపడ్డారు.