KTR | కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ఆర్భాటంగా స్వీకరించిన ప్రజా పాలన అభయ హస్తం దరఖాస్తుల్లో నిర్లక్ష్యం బయటపడింది. ఎంతో జాగ్రత్తగా కంప్యూటరీకరించాల్సిన దరఖాస్తులు రోడ్లపై గాల్లో ఎగురుతూ కనిపించాయి. దీంతో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సంబంధించిన డేటా విషయంలో గందరగోళంలో పడింది. ఎంతో జాగ్రత్తగా కాపాడాల్సిన ఈ డేటా సైబర్ నేరగాళ్ల బారిన పడిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. డేటా బహిర్గతం కావడంతో సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రైవేటు ఏజెన్సీల నిర్లక్ష్యం కారణంగా ప్రజాపాలన దరఖాస్తులు బహిర్గతమైనట్లు వస్తున్న వార్తలను చూశానని కేటీఆర్ అన్నారు. ఆ అప్లికేషన్స్లో కోట్లాదిమంది తెలంగాణ ప్రజల సెన్సిటివ్ డేటా ఉందని అన్నారు. ఈ సమాచారం సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఎవరైనా కాల్ చేసి ఆరు గ్యారంటీలు మంజూరయ్యాయని.. ఓటీపీ అడిగితే చెప్పవద్దని తెలంగాణ సోదరసోదరీమణులను సూచించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాటలు విని అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దని సూచించారు. బీఆర్ఎస్కు ఓటు వేసినా.. ఓటు వేయకపోయినా సరే.. తన మాటలను సీరియస్గా తీసుకుని సైబర్ నేరగాళ్ల బారిన పడవద్దని కోరారు.
I’ve been watching & hearing from concerned citizens about numerous videos of Praja Palana applications being mishandled carelessly by certain private individuals. These application forms contain sensitive data of Crores of Telangana citizens
I urge the state government to take… pic.twitter.com/CPA5DJqwUr
— KTR (@KTRBRS) January 9, 2024
ఇంతకీ భట్టి ఏమన్నారంటే..
‘సైబర్ నేరగాళ్లు అభయహస్తం దరఖాస్తుదారులకు ఫోన్ చేసి ఇల్లు కట్టిస్తామని, పెన్షన్ ఇస్తామని చెబుతున్నారా.. అలా ఇస్తా అంటే మంచిదే కదా.’ ఇదీ అభయహస్తం దరఖాస్తులు మిస్యూజ్ అవుతున్నాయన్న ప్రశ్నలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెటకారపు వ్యాఖ్యలు. ఈ మేరకు మంగళవారం సచివాలయం మీడియాపాయింట్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అభయహస్తం దరఖాస్తులు ప్రైవేటు ఏజెన్సీల చేతుల్లోకి పోతున్నాయని, సోమవారం హైదరాబాద్లోని బాలానగర్ ఫ్లైఓవర్పై ర్యాపిడో బైక్పై తీసుకెళ్తున్న దరఖాస్తులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయి అంశంపై మంత్రిని విలేకరుల ప్రశ్నించగా సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. అసలు దరఖాస్తులు రోడ్డుపై పడిపోయిన ఘటనే జరగనట్లుగా ఆయన వ్యవహరించడం గమనార్హం. దరఖాస్తుల ద్వారా తమ వివరాలు దుర్వినియోగం అవుతున్నాయనే ఆందోళనలో ప్రజలు ఉంటే.. మంత్రి మాత్రం అవేమి పట్టనట్లుగా వ్యవహరించారు. ఒకవేళ దరఖాస్తులు పోతే.. మళ్లీ వారి నుంచి దరఖాస్తులు తీసుకుంటామంటూ చెప్పడం దరఖాస్తుల భద్రతపై వారి నిర్లక్ష్యానికి పరాకాష్ట అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.