KTR | విద్యార్థుల తల్లిదండ్రులకు గర్భశోఖం మిగల్చొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సూచించారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల మరణాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రాజకీయ కోణంలో చూడకుంఆ విద్యార్థులకు మంచి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఇటీవల పెద్దపూర్ గురుకుల పాఠశాలలో పాముకాటుకు గురై మృతి చెందిన విద్యార్థి అనిరుధ్ కుటుంబ సభ్యులను సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనిరుధ్ అనే చిన్నారి మరణం ఆ తల్లితండ్రులతో పాటు ప్రతి ఒక్కరిని తీవ్రంగా బాధిస్తోందన్నారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించి రాజకీయాలు వద్దని.. మన అందరికీ కుటుంబాలు ఉన్నాయన్నారు.
కుటుంబ సభ్యులను కోల్పోతే ఎంత బాధ ఉంటదో అర్థం చేసుకోగలమన్నారు. ఈ 8 నెలల కాలంలో 36 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారన్నారు. కొందరు విషాహారం తిని, మరికొందరు పాముకాట్ల కారణంగా, ఇంకొందరు విద్యార్థులు అనుమానాస్పదంగా చనిపోవటం బాధాకరమన్నారు. 500 వందల పిల్లలు విషాహారం తిని హాస్పిటల్లో జాయిన్ అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. పిల్లలు బాగుండాలి, వారు ప్రపంచంతో పోటీపడే విధంగా చదువుకోవాలని మనం వెయ్యికిపైగా గురుకులాలు పెట్టుకున్నామన్నారు. వాటిని ఇంటర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలుగా కూడా అప్గ్రేడ్ చేసుకున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వం సంక్షేమ పాఠశాలు, సంక్షేమ వసతుల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే తల్లితండ్రి మాదిరిగా బాధ్యత తీసుకోవాలన్నారు.
ఈ విషయంలో రాజకీయం వద్దు.. చనిపోయిన 36 మంది విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు. మిగతా తల్లులకు కూడా మళ్లీ ఇలాంటి గర్భశోకం ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ మీద ఎంతో ఆశపెట్టుకుంటారన్నారు. అలాంటి వారి పిల్లలు చనిపోతే మొత్తం వాళ్ల ఆశలే లేకుండాపోతాయన్నారు. ఈ విషయంలో మేము రాజకీయం చేయాలనుకోవటం లేదని.. ప్రభుత్వం కూడా బేషజాలకు పోవదన్నారు. గతంలో గురుకులాలను అద్భుతంగా తీర్చిదిద్దిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో తమ పార్టీ తరఫున ఒక అధ్యయన కమిటీ వేస్తున్నామన్నారు. 20 పాఠశాలలను పరిశీలించిన చేపట్టాల్సిన చర్యలను ఆయన ఐదారు రోజుల్లో నివేదిక ఇస్తారన్నారు.
ప్రభుత్వానికి సూచనలు చేసే మంచి ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నామని.. దీన్ని రాజకీయంగా భావించవద్దన్నారు. పిల్లలకు పెట్టే ఆహారం విషయంలో ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరముందన్నారు. గతంలో మేము బాసరలో విద్యార్థులకు ఆహారం విషయంలో భరోసా ఇచ్చామని.. కలెక్టర్లు, అధికారులు సంక్షేమ హాస్టల్స్ సర్ప్రైజ్ విజిట్ చేసి ఆహార నాణ్యత ఎలా ఉందో పరిశీలించాలన్నారు. ప్రతి పాఠశాల ఆవరణలను శుభ్రం చేయించాలని.. ఈ పిల్లలు మన పిల్లలు.. ప్రభుత్వ హాస్టళ్లలో చదువుతున్న ఆరున్నర లక్షల మంది పిల్లలకు ప్రభుత్వమే తల్లిదండ్రులని తెలిపారు. ప్రభుత్వం ఈ బాధాకరమైన పరిస్థితిని అర్థం చేసుకోని మంచి చేయాలని కోరుతున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.
KTR | దళిత వాడలో వారం రోజులుగా నో కరెంట్.. డిప్యూటీ సీఎం గారూ జర చూడండి : కేటీఆర్