Konda Surekha | నాంపల్లి క్రిమినల్ కోర్టులు, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : సినీ నటుడు అక్కినేని నాగార్జున, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేర్వేరుగా దాఖలు చేసిన పరువు నష్టం క్రిమినల్ కేసుల్లో ఎట్టకేలకు మంత్రి కొండా సురేఖ గురువారం కోర్టుకు హాజరయ్యారు. ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి శ్రీదేవి ఇటీవల జారీ చేసిన ఆదేశాల మేరకు రెండు కేసుల్లోనూ ఆమె ముద్దాయి కావడంతో తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలనే నింబంధనలను పాటిస్తూ కోర్టుకు హాజరయ్యారు.
గతేడాది గాంధీ జయంతి సందర్భంగా లంగర్హౌజ్లోని బాపూ ఘాట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలపై వేర్వేరుగా పిటిషన్లను దాఖలు చేశారు. సాక్షుల వాంగ్మూలాల్ని, సాక్షాధారాల్ని కోర్టుకు సమర్పించిన తర్వాత వేర్వేరుగా రెండు కేసుల్ని నమోదు చేసింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కోర్టుకు హాజరుకాలేకపోయినట్టు ఆమె తరఫున న్యాయవాది ఇప్పటివరకు గైర్హాజరు పిటిషన్లను కోర్టుకు దాఖలు చేశారు. తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలని కోర్టు నిబంధన విధించడంతో ఆమె కోర్టుకు తప్పనిసరిగా హాజరుకావాల్సి వచ్చింది. కోర్టు ఎదుట హాజరైన పిదప విచారణను ఈ నెల 27కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పలు టీవీ ఛానళ్లు, పత్రికలు ఆమె చేసిన వ్యాఖ్యల్ని ప్రసారం చేశాయని, నాగార్జున, కేటీఆర్లపై వారి పరువుకు భంగం కల్గించేవిధంగా తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు ఆమె చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో, ఆడియోలను నిక్షిప్తం చేసిన పెన్డ్రైవ్ను, ప్రముఖ పత్రికల్లో ప్రచురితమైన క్లిప్పింగ్లను సాక్షాధారారులు కోర్టుకు సమర్పించారు. సాక్షుల, సాక్షాధారలను పరిగణలోకి తీసుకుని విచారణ చేపట్టనుంది.
ఇవి కూడా చదవండి..
Telangana | విద్యార్థినుల నిరసన.. కాంగ్రెస్ 420 హామీలపై ప్రియాంక గాంధీకి పోస్టుకార్డులు..
MLC Kavitha | ఎమ్మెల్సీ కవితకు అపురూపంగా గాజులు తొడిగిన పూసలక్క