హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి, పట్టణప్రగతి పనుల పురోగతి, అధికారుల పనితీరు, నిధుల వినియోగం, భవిష్యత్ కార్యాచరణపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షించనున్నారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు ప్రగతిభవన్లో జరిగే సమావేశానికి స్థానికసంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులను ఆహ్వానించారు. సమావేశంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లక్ష్యాలు, సాధించిన విజయాలు, ఇంకా చేయాల్సిన పనులు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదలచేస్తున్న నిధుల ఖర్చు, హరితహారం, శ్మశానవాటికలు, పల్లెప్రకృతి వనాలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం తదితర అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్షిస్తారు. ఈ నెల 19 తర్వాత ఆకస్మికంగా తనిఖీచేస్తానని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. ఎక్కడైనా పనులు జరగకుంటే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. స్థానికసంస్థల అదనపు కలెక్టర్ల పనితీరుపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇంకా బాగా పనిచేయాల్సి ఉన్నదని, పల్లెప్రగతి, పట్టణప్రగతిలో పనులు పెండింగ్లో ఉన్నాయని, ఐఏఎస్ అధికారులు, పంచాయతీరాజ్ కమిషనర్లు, సీడీఎంఏ కూడా జిల్లాల్లో పర్యటించి పనులతీరును పరిశీలించాలని సూచించారు. వీటన్నింటిపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశంలో మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు, పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తదితరులు పాల్గొంటారు.