Jaya Prakash Narayana | (గుండాల కృష్ణ – హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి) : రెండు గీతలను సమానం చేయాలంటే రెండు పద్ధతులుంటాయి. చిన్న గీతను పెద్దది చేయడం.. ఇది ప్రగతిశీల దృక్పథం. పెద్ద గీతను చెరిపేసి చిన్నగా చేయటం.. ఇది కుంచితత్వం. సో కాల్డ్ మేధావి జయప్రకాశ్ నారాయణ ఇదే కుంచితత్వంలో కొట్టుమిట్టాడుతున్నారు. మాకు దక్కనిది మంట గలవాలి అన్నట్టుగా ఆయన తెలంగాణ అభివృద్ధిపై అవాకులు చెవాకులు పేలుతున్నారు. విడిపోయి అభివృద్ధి పథంలో నడుద్దామనేది తెలంగాణ నైజం.. అలా కాదు అభివృద్ధిలో మీరు ఇక్కడే ఆగాలి అనేది జేపీయిజంలా కనిపిస్తున్నది. ‘కాళేశ్వరం తెల్ల ఏనుగు.. మెట్రో విస్తరణ ప్రాజెక్టు కూడా అలాగే తయారవుతుంది’ అన్న జేపీ వ్యాఖ్యలు ఆషామాషీగా రాలేదు. తెలంగాణను.. అందునా హైదరాబాద్ అభివృద్ధి ఒక్క అడుగు కూడా ముందుకు పడకుండా చేయాలనే పన్నాగం ఆ మాటల వెనుక దాగి ఉన్నది. ఉన్నదానినే దిద్దుకొంటే సరిపోతుందని కాళ్లల్లో ఆయన కట్టెలు పెడతారు. ఈ వితండ వాదాలను రోజంతా చూపేందుకు పచ్చ లోగోలు సిద్ధంగా ఉన్నాయి. వాళ్లు ఠావులకు ఠావులుగా కక్కే విషాన్ని బ్యానర్లుగా పరిచేందుకు పచ్చ పత్రికలూ కాచుకు కూర్చున్నాయి. అయితే ఒకందుకు ఇలాంటివాళ్లకు ధన్యవాదాలు కూడా చెప్పుకోవాలి. తెలంగాణ సాధనలో ఎంత జాగరూకతతో వ్యవహరించామో.. తెలంగాణను అభివృద్ధి చేసుకోవడంలోనూ అంతే అప్రమత్తత అవసరమని జేపీలాంటి వాళ్లు మనకు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటారు. సో.. తెలంగాణ బహుపరాక్!
యావత్తు తెలంగాణకు గుండెకాయలాంటి రాజధానితో రాష్ట్రం మొత్తాన్ని అనుసంధానం చేసేందుకే సీఎం కేసీఆర్ మెట్రో విస్తరణ ప్రాజెక్టును ప్రకటించారు. హైదరాబాద్లో మరిన్ని అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు కల్పించే అనేక ప్రణాళికలు కేసీఆర్ అమ్ముల పొదిలో భద్రంగానే ఉన్నాయి. వాటికీ వేల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయి. మరి జేపీ అలవోకగా చెప్పినట్టు.. మెట్రో విస్తరణపై వెచ్చించే రూ.69 వేల కోట్లు వృథా అనుకుంటే… ప్రపంచంలోని అనేక నగరాలు చేపడుతున్న మెట్రో విస్తరణ ప్రాజెక్టులు కూడా అదే కోవలోకి వస్తాయి. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, పుణె, కోల్కతా, ముంబై.. ఇలా ఒకటేమిటి! ఎదగాలనుకొంటున్న ప్రతి నగరం చేతిలో వందల కిలోమీటర్ల మేర వేల కోట్ల విలువైన మెట్రో విస్తరణ ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. జేపీ సెలవిచ్చినట్టు ఆయా నగరాలు ఇప్పటికే ఉన్న రోడ్లు, ఎక్స్ప్రెస్వేల మీద ఆరేడు వందల కోట్లు వెచ్చించి వందల బస్సులు తిప్పడం చేతగాక కాదు. అతి తక్కువ స్థలం, ఎక్కువ సామర్థ్యంతో మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. నాణ్యమైన జీవన ప్రమాణాలతో పరుగులు పెట్టాలనుకునే మానవ వనరుల అవసరాలను తీర్చాలంటే సంప్రదాయ ప్రజా రవాణా సరిపోదు. ఈ ప్రపంచ సూత్రం జేపీకి తెలియదనుకుంటే మాత్రం అది మన అమాయకత్వమే అవుతుంది.
ప్రపంచ నగరాలే కాదు.. దేశంలోని అన్ని ప్రధాన నగరాలూ మెట్రో ప్రతిపాదనల్లో నిమగ్నమయ్యాయి. ఢిల్లీలో ఇప్పటికే 400 కిలోమీటర్లకు పైగా మెట్రో నెట్వర్క్ ఉన్నది. అయినా రాష్ట్ర సరిహద్దులు దాటి హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల భూభాగాల్లోనూ తన మెట్రో ప్రాజెక్టులను విస్తరిస్తూ పోతున్నది. దీని కోసం ప్రత్యేకంగా నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎన్సీఆర్టీసీ) ఏర్పాటు చేసింది. ప్రధాన నగరంపై భారం పడకుండా ఉండాలంటే ప్రజా రవాణాను విస్తరించాల్సిందే.
బెంగళూరు కూడా మెట్రోను సరిహద్దులు దాటిస్తున్నది. అక్కడ ఇప్పటికే 103 కిలోమీటర్ల మెట్రో ఉన్నది. బెంగళూరును ఆనుకొని ఉన్న బొమ్మసంద్ర పారిశ్రామిక ప్రాంతం. దానికి 20 కిలోమీటర్ల దూరంలో తమిళనాడులోని హోసూరు కూడా పారిశ్రామిక ప్రాంతమే. అక్కడ-ఇక్కడ రెండు రాష్ర్టాల వాళ్లు పని చేస్తున్నారు. అందుకే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి బొమ్మసంద్ర నుంచి హోసూరు వరకు 20.5 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టును చేపడుతున్నాయి. భూసేకరణతో ఒక కిలోమీటరుకు రూ.500-600 కోట్ల వరకు అంటే మొత్తంమీద రూ.10-15 వేల కోట్ల వరకు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టు బదులు వంద ఏసీ బస్సులు తిప్పాలనే సదరు జేపీలాంటి బుర్ర కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాల పెద్దలకు లేదా? ఇక్కడనే కాదు.. బెంగళూరు (126 కి.మీ.), ముంబై (136 కి.మీ.), నవీ ముంబై (95 కి.మీ.), కోల్కతా (15 కి.మీ.), ఢిల్లీ (57 కి.మీ.), గురుగ్రామ్ (200 కి.మీ.) ఇలా ఎన్నో నగరాలు ఇప్పుడున్న మెట్రోకు అదనంగా వేల కోట్లతో వందల కిలోమీటర్ల ప్రాజెక్టులను చేపడుతూనే ఉన్నాయి. గూగుల్లో అన్వేషిస్తే ఈ ప్రాజెక్టుల వివరాలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి. ఈ రాష్ర్టాల్లోనూ ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్వేలు, ఔటర్లూ ఉన్నాయి. అక్కడి ప్రభుత్వ పెద్దలకూ మెట్రో ప్రాజెక్టులకు పెట్టే ఖర్చులో ఐదో వంతుతో ఏసీ బస్సులు తిప్పొచ్చని తెలుసు. మరెందుకు జేపీలా అనితర సాధ్యమైన, ఆయనబాపతు ఆలోచన వారికి రాలేదు? ఇలాంటి మేధావుల కొరత ఆయా రాష్ర్టాల్లో ఏమైనా ఉన్నదా? జేపీజీ.. మీ అవసరం ఇక్కడి కంటే ఆయా రాష్ర్టాల్లోనే ఎక్కువనేమో! ఏకబార్ దేఖోనా!
నగరాలకు అవసరమైన భౌగోళిక, వాతావరణ అనుకూలతలు హైదరాబాద్ సొంతం. ప్రపంచంలో అరుదుగా కొన్ని నగరాలకు మాత్రమే ఈ అనుకూలతలున్నాయి. ఉద్యమ సమయం నుంచీ సీఎం కేసీఆర్ చెబుతున్నది కూడా ఇదే. అందుకే ఈ వజ్రపు తునకను ఎలా సానబెట్టాలి? ఆ ఫలాలను తెలంగాణ సమాజానికి ఎలా అందించాలి? అనేది కేసీఆర్కు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. అందుకే పొద్దున లేచింది మొదలు… జేపీలాంటి వాళ్లు హైదరాబాద్పై పడి ఏడుస్తూనే ఉన్నారు. ఢిల్లీ నగరం నలుచెరగులా విస్తరించే అవకాశం లేదు. అందుకే ప్రత్యేకంగా నేషనల్ క్యాపిటల్ రీజియన్ అని ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసి..హర్యానా, పంజాబ్ తదితర రాష్ర్టాల వైపు విస్తరిస్తున్నారు. బెంగళూరు కూడా కర్ణాటకలో ఒక కొనన ఉంటుంది. తమిళనాడులో సైతం చెన్నై ఒక కొనగా ఉండటంతో పాటు సముద్రం ఉన్నది. ముంబైకి సముద్రం మూలాన విస్తరించే అవకాశం లేదు. త్రివేండ్రం కూడా పొడవునా ఉండే కేరళకు ఒకవైపున ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అంటే మరి ఏ రాజధానిని ప్రామాణికంగా తీసుకోవాలో జేపీలాంటి సోకాల్డ్ మేధావులు సెలవిస్తేగానీ అంచనా వేయలేం. కానీ హైదరాబాద్కు మాత్రం నలుచెరగులా (రేడియల్ డెవలప్మెంట్) విస్తరించేందుకు అవకాశం ఉన్నది. ఈ సత్యాన్ని ఉమ్మడి పాలకులు కూడా గుర్తించలేదు. అందుకే కేవలం ప్రధాన హైదరాబాద్ మీదనే దృష్టి పెట్టి దీన్నో సమస్యల సంద్రంగా మార్చారు. తొమ్మిది సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు కేవలం ఒక్క సైబర్ టవర్ నిర్మించి, హైదరాబాద్కు తానే పురుడుపోసి, బొడ్డు తెంపినట్టుగా మాట్లాడారు. ఇదే తెలంగాణ ఏర్పడిన అనతి కాలంలోనే హైదరాబాద్ నలువైపులా కనీసంగా 15-20 కిలోమీటర్లు శరవేగంగా విస్తరించడమే కాదు..2014లో నగరానికి కొస అనుకునే ప్రాంతాలైన ఉప్పల్, కూకట్పల్లి, నిజాంపేట, ఎల్బీనగర్, హయత్నగర్, ఈసీఐఎల్, కోకాపేటలాంటి ప్రాంతాలు ఇప్పుడు నగరం నడిబొడ్డును తలపిస్తున్నాయి. భూకంపాలు, సునామీ వంటి ప్రకృతి విపత్తులకు అవకాశం లేనందున దిగ్గజ అంతర్జాతీయ కంపెనీలు తమ డాటా సెంటర్లను ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాయి. అన్నింటికీ మించి నలువైపులా భూమి లభ్యత పుష్కలంగా ఉన్నది. ఇలా చెప్పుకొంటూ పోతే హైదరాబాద్ అభివృద్ధి విస్తరణకు అవధుల్లేవు. ఆదినుంచీ తెలంగాణను వ్యతిరేకించిన జేపీలాంటి వారు జీర్ణం చేసుకోలేనిది ఇదే. అందుకే ఈ వజ్రపు తునకపై వక్రపు బుద్ధిని ప్రదర్శిస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాలపాటు పాలకులు హైదరాబాద్ను కేవలం ఒక బంగారు గుడ్డు పెట్టే బాతుగా చూశారు. గుడ్లు తింటే సరే కానీ బాతును సైతం బంధించి, దానినో జీవచ్ఛవంలా తయారు చేశారు. ‘తమ్ముళ్లూ… మీరు చూస్తున్న సైబరాబాద్ నేను సృష్టించిందే’ అని చెప్పే ది గ్రేట్ చంద్రబాబు తాగునీరు, డ్రైనేజీలాంటి కనీస వసతులు మరిస్తే, తెలంగాణ ప్రభుత్వం ఆ మౌలిక వసతులను కల్పించింది.
తెలంగాణకు నేను అడ్డం కాదు.. పొడవు కాదు అన్న వైఎస్ రాజశేఖర్రెడ్డి కేవలం కాగితాలపై గ్రేటర్ హైదరాబాద్ను సృష్టిస్తే..తెలంగాణ ప్రభుత్వమే వేల కోట్లు వెచ్చించి శివారు ప్రాంతాలకు తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలను కల్పించింది. కనీస వసతులు కల్పించకుండా కేవలం సర్కారు ఆదాయం కోసం నగర విస్తరణను చూపించడం సమైక్య పాలకుల రీతి. హైదరాబాద్ను ఆర్థిక వనరుగా చూపి, ఇక్కడ వచ్చే ఆదాయంతో సీమాంధ్రలో అనేక తాగు, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకున్నది వాస్తవం కాదా? ఆ ధన, జల యజ్ఞ సమయంలో ప్రత్యక్ష సాక్షిగా సదరు జేపీ శాసనసభలో ఉండలేదా? అందుకే ఇప్పుడు కూడా అ దే సంప్రదాయాన్ని కొనసాగించాలనేది ఆయన వాదన. నగరం విస్తరించినా, శివారు ప్రాంతా లు మౌలిక వసతులు లేకుండా కునారిల్లాలి. ప్రధాన నగరంపై ఇంకా భారం పెరగాలి. డ్రైనేజీ, నాలాలు, తాగునీరు, వరదలు అన్ని మౌలిక వసతులపైనా భారం పెరిగి, ఉమ్మడి రాష్ట్రంలో లెక్కనే సాలెగూడులా సమస్యలు చుట్టిముట్టి హైదరాబాద్ ఉక్కిరిబిక్కిరి కావాలి. ఇది కదా..జేపీలాంటి పెద్దలు ఆశించేది! కానీ సీఎం కేసీఆర్ ఆలోచనలు అందుకు భిన్నం. ఇదో కాస్మొపాలిటన్ సిటీ అని ఆయన ఎప్పు డూ చెప్తుంటారు. దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో స్థానిక భాష రాకుంటే మనుగడ కష్టమవుతుంది. కానీ హైదరాబాద్లో అలా కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరికీ కనీసంగా రెండు భాషలు తెలిసుంటాయి. అందుకే ఎక్కడివారైనా ఇక్కడికి వచ్చి అనతి కాలంలోనే ఈ ప్రాంతంతో మమేకమవుతారు. ఇండ్లు కట్టుకోవడమనేది వృథా పెట్టుబడి (డెడ్ ఇన్వెస్ట్మెం ట్), దానిపై వచ్చే పెట్టుబడితో విలాసంగా అద్దె ఇండ్లల్లో ఉండొచ్చనే భావనతో ఉండే మార్వాడీలు సైతం నగరంలోని అనేక కాలనీల్లో పదుల సంఖ్యలో పోటీపడి మరీ ఆస్తులు కొనుగోలు చేస్తున్నారంటే ఈ నగర మహత్యం కాకుంటే ఇంకేంది? హైదరాబాద్ ఆత్మ తెలిసిన నాయకుడు అయినందునే సీఎం కేసీఆర్ సమీప భవిష్యత్తులో నగర విస్తరణ 40-50 కిలోమీటర్ల వరకు వెళుతుందని ముందుగానే ఊహించి మెట్రో విస్తరణలో భాగంగా షాద్నగర్, ఇస్నాపూర్, బీబీనగర్ వంటి దూర ప్రాంతాలకు మెట్రో పట్టాలు వేసేందుకు నిర్ణయించారు.
గతంలో పారిశ్రామిక రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల (స్కిల్డ్) పాత్ర పరిమితంగా ఉండేది. భౌతికంగా చేసే పని ఎక్కువగా ఉండేది. కానీ కొన్ని దశాబ్దాలుగా వస్తున్న విప్లవాత్మక మార్పులతో యాంత్రీకరణ, కంప్యూటరీకరణ విపరీతంగా పెరిగింది. తద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరుల పాత్ర అత్యంత కీలకంగా మారింది. దీనికి తోడు అవధుల్లేకుండా దూసుకుపోతున్న సేవా రంగం (సర్వీస్ సెక్టార్) నైపుణ్యం, సృజనాత్మకత ఉన్న మానవ వనరులతో నిండిపోతున్నది. అలాంటి మానవ వనరుల నుంచి నాణ్యమైన సేవలు అందాలంటే అధునాతన మౌలిక వసతులు కావాలి. అలాంటి వసతులు ఉన్న నగరాల వైపే అంతర్జాతీయ సంస్థలు పరుగులు తీస్తున్నాయి. అందులో భాగంగానే గత తొమ్మిది, పది సంవత్సరాలుగా అంతర్జాతీయ ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలతోపాటు మల్టీ నేషన్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు హైదరాబాద్కు క్యూ కడుతున్నాయి. మౌలిక వసతులపై ప్రభుత్వాలు వెచ్చించే ప్రతి పైసాకు పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి, పెట్టుబడి, మార్కెటింగ్ రంగాల రూపంలో అనేక రెట్ల ప్రతిఫలాలు ఉంటాయి. సాధారణంగా వ్యాపారంలో ఒక రూపాయి పెడితే ఎన్ని రూపాయలు వస్తుందనేది లెక్కిస్తారు. దానిని ఎకనామిక్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (ఈఐఆర్ఆర్) అంటారు. కానీ పట్టణ మౌలిక వసతులపైన, మరీ ముఖ్యంగా మెట్రోలాంటి పట్టణ రవాణా వ్యవస్థపై వెచ్చించే వ్యయంపై రాబడి ఆశించలేం. దానిని సోషల్-కాస్ట్ బెనిఫిట్ (ఎస్సీబీ) కోణంలో చూడాలనేది ఘనత వహించిన జేపీ, ఆయన మిత్రుడు చంద్రబాబు భుజాలపై మోస్తున్న ప్రపంచ బ్యాంకు సెలవిచ్చిన సూత్రాలే. వాస్తవానికి పట్టణ రవాణా వ్యవస్థ లాభసాటిగా ఉండదు. తెలంగాణనే చూసుకుంటే.. జిల్లాల్లో ఆర్టీసీ డిపోలు లాభాల్లో ఉంటే, గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీకి లాభాలు ఉండవు. ప్రపంచంలో ఏ నగరంలోనైనా సంప్రదాయ రోడ్డు మొదలు అధునాతన మెట్రోల వరకు ఏ ప్రజా రవాణా వ్యవస్థ కూడా లాభాల్లో ఉండదు. ఆయా ప్రభుత్వాలే ఆ నష్టాలను భరిస్తాయి. రవాణా వ్యవస్థ ద్వారా ప్రయోజనం పొందే జనం ఇతర రంగాల్లో సృష్టించే సంపద ప్రభుత్వాలకు ప్రధానం. అనేక దేశాలు తిరిగిన మాజీ ఐఏఎస్ అధికారి అయిన స్వయంప్రకటిత మేధావి జేపీకి ఈ మాత్రం లాజిక్కులు తెలియవా? అయినా ఔటర్ చుట్టూ మెట్రో వస్తే ఎక్కేవారెందరు? వచ్చే ఆదాయమెంత? అని కాకి లెక్కల ఊహల్లోకి లాగి గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తారు.
బెంగళూరు..ఐటీ రంగంలో క్యాపిటల్. ఇది నిన్నటిమాట. గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో హైదరాబాద్ బెంగళూరును దాటి దూసుకుపోతున్నది. కారణం..అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు. అందుకే ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్తలు హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులు, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ చూసి వేనోళ్ల పొగుడుతున్నారు. అదే నోటితో బెంగళూరు నగర ట్రాఫిక్ నరకాన్నీ ప్రస్తావిస్తున్నారు. సాధారణ పౌరులు సైతం భవిష్యత్తులో హైదరాబాద్ నగరం బెంగళూరులా మారొద్దని కోరుకుంటున్నారు. అందుకే కేసీఆర్ దూరదృష్టి ఉన్న నాయకుడిగా మెట్రో విస్తరణకు నడుం బిగించారు! వాస్తవానికి ఓఆర్ఆర్ నిర్మాణ డిజైన్ ప్రజా రవాణా ప్రాతిపదికన జరగలేదు. సాధారణంగా ప్రపంచ నగరాల్లోని ఎక్స్ప్రెస్వేల్లో ప్రజా రవాణా దాదాపుగా ఉండదు. ఆ కారణంగానే ఓఆర్ఆర్ను జన సంచారం లేకుండా కేవలం వాహనాలు వేగంగా దూసుకువెళ్లేందుకే డిజైన్ చేశారు. అలాంటప్పుడు ప్రజా రవాణాలో భాగంగా ఓఆర్ఆర్పై వందల బస్సులు నడపడమంటే జన సంచారానికి అవకాశం కల్పించడమే కదా? ఓఆర్ఆర్పై ప్రతి 7-8 కిలోమీటర్లకు ఒక ఇంటర్ఛేంజ్ ఉన్నది. దీనికి అనుగుణంగా బస్సు స్టాప్లు ఏర్పాటు చేయడం సాధ్యమా? ఓఆర్ఆర్ను గరిష్ఠంగా రోజుకు రెండున్నర లక్షల వాహనాలు వెళ్లేలా డిజైన్ చేశారు. ఇప్పుడు 1.80 లక్షల వరకు వెళుతున్నాయి. సమీప కాలంలోనే ఇది గరిష్ఠ సంఖ్య చేరుకుంటుంది. వీటికి తోడు జేపీ చెప్పినట్టు బస్సులు కూడా తిప్పితే రెండేండ్లలోనే గరిష్ఠానికి చేరుకుంటుంది. మరి అప్పుడు నగర రోడ్లకు, ఓఆర్ఆర్కు తేడా ఏముంటుంది? అప్పుడు కూడా మళ్లో వంద బస్సులు వేస్తే సరిపోతుందా? ట్రాఫిక్ కష్టాల్లో హైదరాబాద్ మరో బెంగళూరు కావాలని కోరుకుంటున్నారా? ఇదేనా యెల్లో బ్యాచ్ ఎజెండా? అందులో భాగమేనా మెట్రో విస్తరణపై ప్రేలాపనలు?
సీఎం కేసీఆర్ రూ.69 వేల కోట్లతో మెట్రో విస్తరణ ప్రాజెక్టు ప్రకటించారు. రాత్రికి రాత్రి రూ.69 వేల కోట్లు కుమ్మరిస్తే పొద్దున్నే మెట్రో దర్శనమిస్తుందా? విజన్ ఉన్న ప్రభుత్వ అధిపతిగా రానున్న వందేండ్లను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. జనావాసాలు ఏర్పడిన చోట మేమే అభివృద్ధి చేశామని ముద్ర కొట్టుకోవడం కాదు..అభివృద్ధి చేసి అక్కడికి జనావాసాలను ఆకర్షించడం అనేది సీఎం కేసీఆర్ పాలసీ.
సీఎం కేసీఆర్ రూ.69 వేల కోట్లతో మెట్రో విస్తరణ ప్రాజెక్టు ప్రకటించారు. రాత్రికి రాత్రి రూ.69 వేల కోట్లు కుమ్మరిస్తే పొద్దున్నే మెట్రో దర్శనమిస్తుందా? విజన్ ఉన్న ప్రభుత్వ అధిపతిగా రానున్న వందేండ్లను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. జనావాసాలు ఏర్పడిన చోట మేమే అభివృద్ధి చేశామని ముద్ర కొట్టుకోవడం కాదు..అభివృద్ధి చేసి అక్కడికి జనావాసాలను ఆకర్షించడం అనేది సీఎం కేసీఆర్ పాలసీ. మెట్రో ప్రాజెక్టులపై సర్వే మొదలవుతుంది. సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్) సిద్ధమవుతాయి. అంచెలంచెలుగా మూడు, నాలుగేండ్లలో ప్రణాళిక పూర్తిగా అమలవుతుంది. అప్పటిలోగా నగరం అంచనా మేరకు విస్తరిస్తుంది. కానీ జేపీ తీరెలా ఉందంటే..నగరం మొత్తం విస్తరించి, ఏండ్ల తరబడి జనం ఇబ్బందులు పడిన తర్వాతగానీ ఎంతమంది మెట్రో ఎక్కుతారు? టికెట్ల మీద ఎంత లాభం వస్తుంది? ఇలా లెక్కలు వేసుకొని తీరిగ్గా అప్పుడు ప్రణాళికలు రూపొందించమంటున్నారు. అంటే ఈలోగా మౌలిక వసతులు లేవంటూ అంతర్జాతీయ సంస్థలు మొహం చాటేస్తాయనేది సోకాల్డ్ మేధావి దురాశ. ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో ఏర్పాటుచేస్తే ఎక్కేందుకు ఎవరూ లేక ఖాళీగా ఉంటుందంటూ జోస్యం చెప్పే ఈ మహా జ్ఞానికి హైదరాబాద్ మెట్రో మొదటి దశ డిజైన్ సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్టు కనెక్టివిటీని సూచించే కనీస సోయి లేకపోవడం బాధాకరమే. ఇప్పుడు మెట్రో స్టేషన్ల నుంచి కాలనీలకు బస్సులు అనుసంధానించాలని ఆలపిస్తున్న ఈ గొంతు..మెట్రో అలైన్మెంట్ సమయంలో స్టేషన్ల వద్ద భారీ పార్కింగ్లు ఉండాలనే డిమాండును ఎందుకు వినిపించలేదు? పైగా ఓఆర్ఆర్ మెట్రో అనేది ఇతర ప్రాంతాల కంటే తక్కువ వ్యయంతో పూర్తవుతుంది. భూసేకరణ అవసరం లేదు. నగరంలో మెట్రో మాదిరిగా 23 మీటర్ల దాకా ఎలివేషన్ కూడా అవసరం లేదు. ఓఆర్ఆర్ మేరకు 3-5 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే సరిపోతుంది. దీంతో కిలోమీటరుకు రూ.153 కోట్ల వ్యయమే అవుతుంది. ఇతర నగరాల్లో కిలోమీటర్కు రూ.400 కోట్లకు పైగా వ్యయం అవుతుంది. అదే జేపీ చెప్పినట్టు అభివృద్ధి చెందిన తర్వాత నిర్మించాలంటే అంచనా వ్యయం 40-50 శాతం పెరుగుతుంది. అందువల్ల నాకు నేను మేధావిని అని ముద్రవేసుకొంటే చాలదు జేపీగారూ..! టీవీ కెమెరా చూడగానే గింగిరాలెత్తి ఆవేశపడటం అనర్థదాయకం. నువ్వు వద్దన్నా తెలంగాణ కొట్లాడి రాష్ట్రమైంది. తనబతుకేదో తాను బతుకుతున్నది. నచ్చితే ఇక్కడ ఉండొచ్చు. నచ్చకుంటే స్వరాష్ర్టానికి వెళ్లొచ్చు. అక్కడ నచ్చిన సలహాలు ఇచ్చుకోవచ్చు. తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణవాడిలా ఉండాలని తెలుసుకొన్నవాడే నిజమైన మేధావి.