గద్వాల/అయిజ/శ్రీశైలం, ఆగస్టు 5 : కృష్ణా, భీమా నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో జూరాల కళకళలాడుతున్నది. బుధవారం డ్యామ్కు 2.45 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 33 గేట్లు తెరిచి దిగువకు 2,18,790 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తికి 26,208 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మొత్తం అవుట్ఫ్లో 2,48,791 క్యూసెక్కులుగా నమోదైంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్, భీమా నదికి పెద్దఎత్తున వరద వస్తున్నది. ఆర్డీఎస్ ఆనకట్టకు వరద రాక మొదలైందని కర్ణాటక డీఈ శాంతరాజు తెలిపారు. తుంగభద్ర డ్యామ్కు ఇన్ఫ్లో 76,251 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 1,505 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి సామర్థ్యం 105.788 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 60.800 టీఎంసీలు నిల్వ ఉన్నాయని డ్యామ్ సెక్షన్ అధికారి కిరణ్ తెలిపారు. శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో 2,44,998 క్యూసెక్కులు నమోదైనట్టు అధికారులు తెలిపారు.
మహదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ(లక్ష్మీ) బరాజ్కు బుధవారం 1,01,530 క్యూసెక్కులు రాగా మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని భారీ నీటిపారుదల శాఖ అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. బరాజ్ గరిష్ఠ నీటి ప్రవాహం ఎత్తు రివర్ బెడ్ నుంచి సముద్ర మట్టానికి 100 మీటర్లు కాగా, ప్రస్తుతం 90.40 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నదని అధికారులు తెలిపారు.
ధర్మారం : కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ -2 లో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఏడురోజులుగా పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి బరాజ్లోని నీటిని ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్హౌస్ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర (మధ్యమానేరు) జలాశయానికి తరలిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం 1,3,6,7 మోటర్లను ఆన్ చేయగా, ఒకో మోటర్ ద్వారా 3,150 క్యూసెకుల చొప్పున 12,600 క్యూసెకుల నీటిని నంది రిజర్వాయర్ మీదుగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రీ పంప్హౌస్కు తరలిస్తున్నారు. ఇక్కడ 1, 2, 4, 5 బాహుబలి మోటర్లను ఆన్చేసి వరద కాలు వ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ రా జరాజేశ్వర జలాశయానికి తరలిస్తున్నారు. ఇప్పటివరకు గాయత్రీ పంప్హౌస్ ద్వారా 9 టీఎంసీల నీటిని తరలించినట్టు అధికారు లు తెలిపారు. గురువారం శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి లోయర్ మానేర్ డ్యా మ్కు విడుదల చేస్తామని పేర్కొన్నారు.