అంబాజోగై: దృఢ సంకల్పానికి, ఒక తల్లికి తన పిల్లల చదువుల పట్ల ఉండాల్సిన అంకిత భావానికి మహారాష్ట్రలోని బీడ్ జిల్లా అంబాజోగైకు చెందిన రమాబాయి రణ్వీర్(47) స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలిచారు. భారతీయ ప్రసారక్ సంస్థ వారి ఖోలేశ్వర్ విద్యా సముదాయం అమృత మహోత్సవం సందర్భంగా గత నెల 30న నిర్వహించిన ‘అమృత్ దౌడ్’లో ఆమె పాల్గొని రూ.3 వేల నగదు బహుమతిని గెలుచుకొన్నారు.
ఆ డబ్బును తన కూతురి చదువు కోసం ఉపయోగించాలని ఆమె నిర్ణయించారు. ఈ మారథాన్లో స్థానిక యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరాడంబరమైన చీర, చెప్పులు(స్లిప్పర్స్) ధరించి రమాబాయి ఒక సాధారణ పోటీదారుగా పోటీలో పాల్గొన్నారు. ఆమె చివరికి విజేతగా నిలుస్తుందనడానికి అప్పుడు పెద్ద సూచనలేవీ లేవు. కానీ పోటీ ప్రారంభం కాగానే ఆమె దృఢ సంకల్పంతో పరుగెత్తారు. అయితే చెప్పులు జారి పోతుండటంతో ఆమె వేగంపై ప్రభావం పడింది. దీంతో ఆమె పరుగును ఆపకుండా, వాటిని చేతుల్లో పట్టుకొని తన వేగాన్ని కొనసాగించారు.
వట్టి కాళ్లతో రాళ్లున్న రహదారిపై చీరతో పరుగెత్తడం లాంటి సవాళ్లున్నప్పటికీ, ఆమె గమ్యస్థాన గీతను చేరుకోవడంపైనే తన దృష్టిని సారించారు. బూట్లు, ట్రాక్ సూట్లు ధరించిన ఇతర యువ పోటీదారులను దాటి ముందుకెళ్లేందుకు ఆమె పట్టుదల ఆమెకు సహకరించింది. దీంతో ఆమె మొదటగా గమ్యస్థానాన్ని చేరి మారథాన్ను గెలిచారు. ఆమె విజయం పట్ల ప్రేక్షకులు, నిర్వాహకుల నుంచి భావోద్వేగ స్పందన వ్యక్తమైంది. కూతురి చదువు పట్ల ఆమెకు ఉన్న పట్టుదల, నిబద్ధతను వారు ప్రశంసించారు. రూ.3 వేల నగదు బహుమతిని కూతురి చదువు కోసం ఉపయోగించనుండటంతో ఈ విజయం ఆమె, ఆమె కుటుంబానికి మరింత అర్థవంతంగా మారింది.