ఖమ్మం కమాన్బజార్, ఆగస్టు 5: గ్రూప్స్ నోటిఫికేషన్ల జాప్యంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ముదిగొండ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన జి.వేణుకుమార్ బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా వేణుకుమార్ విషయంలో బీఆర్ఎస్ సీనియర్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఆస్పత్రి యాజమాన్యంతో నేరుగా మాట్లాడి వేణుకుమార్ డిశ్చార్జ్ బిల్లును మాఫీ చేయించారు. సకాలంలో వైద్యం అందించిన డాక్టర్ కేసోజు భారత్బాబు, వైద్యబృందం, సిబ్బందిని నామా అభినందించారు. ఇప్పటికే నామా ట్రస్ట్ తరఫున వేణుకు రూ.50 వేలు అందించిన నామా మరోసారి చొరవ తీసుకున్నారు. వేణుకుమార్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. వేణుకుమార్, ఆయన కుటుంబ సభ్యులు ఫోన్లో నామాకు కృతజ్ఞతలు తెలిపారు.