ములుగు, ఆగస్టు5 (నమస్తేతెలంగాణ) : ఆదిదేవత, మొదటి మొక్కుల తల్లి గట్టమ్మ ఆలయం కేంద్రంగా ములుగు జిల్లాకు చెందిన ప్రభుత్వ కార్యాలయాలకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పునాదులకు అడుగులు పడ్డాయి. మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద ఇచ్చిన మాటకు కట్టుబడి కేసీఆర్ తన జన్మదిన కానుకగా 2017 ఫిబ్రవరి 17వ తేదీన ములుగును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసి రాష్ట్రంలోని 33 జిల్లాలతో సమానంగా నిధులు కేటాయించాలనే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన కార్యరూపం దాల్చి వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి వైపు దూసుకెళ్లేందుకు దోహద పడింది.
దీంతో పాటు అన్ని జిల్లాల మాదిరిగా సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం(ఐడీవోసీ) కోసం బీఆర్ఎస్ సర్కారు హయాంలో గట్టమ్మ దేవాలయం కేంద్రంగా అటవీ శాఖకు చెందిన భూములను రెవెన్యూ శాఖకు బదిలీ చేసి బండారుపల్లి శివారులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆనుకొని ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు 50 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అందులో 16 ఎకరాల భూమిని సమీకృత కలెక్టరేట్ కోసం కేటాయించి గత ప్రభుత్వ హయాంలోనే రూ. 63.5 కోట్లను కలెక్టరేట్ భవన నిర్మాణానికి, రూ.8.5 కోట్ల నిధులను కలెక్టర్, అదనపు కలెక్టర్ల భవన నిర్మాణాల కోసం కేటాయించారు. 2023 జూన్ 7వ తేదీన అప్పటి మంత్రులు కేటీఆర్, దయాకర్రావు, సత్యవతి రాథోడ్లు ముఖ్య అతిథులుగా హాజరై సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఆరు నెలల పాటు వేగంగా కొనసాగిన పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిధుల కొరతతో మందగించాయి. చివరికు 32 నెలల పాటు పనులు జరిగి తుది దశకు చేరుకొని ప్రారంభానికి సిద్ధమైంది. ప్రస్తుతం వచ్చే శ్రావణ మాసంలో ఈ నెల 13వ తేదీ నుంచి 20 లోగా ముఖ్యమంత్రి, మంత్రులతో ప్రారంభోత్సవానికి ఆర్అండ్బీ శాఖ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తిగా గుట్టలాగా ఉన్న ఎత్తు ప్రాంతంలో ములుగు కలెక్టరేట్ భవనాన్ని నిర్మించగా, ప్రస్తుతం నూతన హంగులతో చుట్టుపక్కన పొలాలతో అద్భుత కట్టడంగా దర్శనమిస్తున్నది. రాష్ట్రంలోనే అత్యంత సుందరంగా ములుగు కలెక్టరేట్ భవన సముదాయం నిలువనున్నది.
ఎంతో ముందు చూపు ఆలోచనతో గట్టమ్మ పరిసర ప్రాంతాల్లో కార్యాలయాల ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. సమీ కృత కలెక్టరేట్తో పాటు 300 పడకల ప్రభుత్వ దవాఖాన పూర్తి కాగా, ప్రస్తుతం అందులో మెడికల్ కళాశాల నడుస్తున్నది. దాని పక్కనే గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. గిరిజన యూనివర్సిటీ కోసం గట్టమ్మ సమీపంలో 347 ఎకరాల స్థలాన్ని కేటాయించగా ప్రహరీ నిర్మాణ పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. ఒకే ప్రాంతంలో ప్రజలకు అన్ని సేవలు అందేలా కొనసాగుతున్న కార్యాలయాల నిర్మాణ పనులతో గట్టమ్మ ప్రాంతం అభివృద్దికి దిక్సూచిగా మారింది.
సమీకృత కలెక్టరేట్ పక్కనే ఎస్పీ కార్యాలయం కోసం భూమిని కేటాయించడంతో పాటు దాని పక్కనే కోర్టు భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించారు. ఆ ప్రాంతంలో కోర్టు భవన నిర్మాణ పనులు సైతం ఊపందుకున్నాయి. ఈ నెల 13వ నుండి 20వ తేదీలోగా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పర్యటించి సమీ కృత కలెక్టరేట్ను ప్రారంభించనున్నారు. గట్టమ్మ ఎదురుగా భారీ ఎత్తున పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే హ్యామ్ రోడ్ల పైలాన్తో పాటు ఇంచర్ల సమీపంలో నిర్మించిన ఇందిర మహిళా శక్తి భవనాన్ని, ములుగు మండలంలోని పొట్లాపూర్ ఎత్తిపోతల పథకం, మంగపేట, మల్లంపల్లి లో తహసీల్దార్ కార్యాలయాలు, మేడారంలో ఆర్అండ్బీ అతిథి గృహం, ములుగులో పీఆర్ ఎస్ఈ కార్యాలయం, ఏటూరునాగారంలో ఐటీడీఏ భవనం వంటి నిర్మాణ పనులకు కలెక్టరేట్ ఆవరణలో ప్రారంభోత్సవాలతో పాటు శంకుస్థాపనలకు శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు.