Jaya Prakash Narayana | ఆయనొక స్వయం ప్రకటిత మేధావి. ఇంకా చెప్పాలంటే యెల్లో మీడియా ప్రవచిత మేధావి. ఆయనకు తెల్వని విషయం లేదు. తెలిసీ ఇప్పటికి సాధించిందీ లేదు! తగుదునమ్మా అని ఎవరూ అడగకుండానే ఉచిత సలహాలివ్వడానికి ముందుంటారు. ప్రభు త్వం ఏ పని చేసినా, రంధ్రాన్వేషణ చేసి, కోడిగుడ్డు మీద ఈకలు పీకడం ఆయన నైజం. ప్రైవేటీకరణకు ముద్దుపేరైన ప్రపంచబ్యాంకు సంస్కరణలకు బ్రాండ్ అంబాసిడర్. ‘లైస్, డామ్ లైస్, స్టాటిస్టిక్స్’ అనే సామెత తెలిసినప్పటికీ.. వాటినే పట్టుకుని వల్లె వేస్తూ, తన గొప్పతనాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తుంటారే తప్ప అంకెలకు, లాభనష్టాలకు అతీతంగా ‘మనిషి- అతని సంక్షేమం’ అనేది ఒకటి ఉంటుందనేది ఆయనకు పట్టదు.
ఆ స్వయం ప్రకటిత మేధావి పేరే జయప్రకాశ్ నారాయణ ఉరఫ్ జేపీ!
ఐఏఎస్ మాజీ అధికారి. మొన్నటికి మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు వేస్ట్ అన్న అయన బంగారు నోటి నుంచి తాజాగా హైదరాబాద్లో మెట్రో రైలు విస్తరణ అక్కర్లేదనే ఆణిముత్యం రాలిపడింది! పాపం శమించుగాక! జేపీగారు, వారి కథా కమామీషు సంగతేంటో ఒక్కసారి చూద్దాం!!
అది గుర్రమా?.. అశ్వమా? అంటే రెండూ కాదు.. గుశ్వము అన్నాడట వెనకటికెవరో!
తెలంగాణలో తిష్ఠవేసిన స్వయం ప్రకటిత ఆంధ్రా మేధావులది సరిగ్గా అదే తీరు. వాళ్లు గుశ్వమేధావులు!!
ఈ గుశ్వ మేధావుల్లో ప్రథముడు జయప్రకాశ్ నారాయణ. సరే.. ఆయనెవరు? ఎక్కడివాడు? ఆయన నేపథ్యం ఏమిటి? ఆయన ఎవరు తయారు చేసిన మేధావి? అనేది కొత్తగా చెప్పేదేమీ లేదు. ఆయనే తన వ్యాఖ్యానాలు, విమర్శలు, దీవెనలు, శాపాలతో ఎప్పటికప్పడు చెప్పుకొంటూనే వస్తున్నారు. అది కూడా తెలియనివాళ్ల కోసం చెప్పాలంటే ఈ దేశంలో ఉన్న వేలాది మంది మాజీ ఐఏఎస్ అధికారుల్లో జేపీ ఒకరు. మంచి శిక్షణ పొందిన ఆ అధికారులు తమ ప్రతిభను దేశం కోసం ఉపయోగించగా, జేపీ అది కూడా చేయలేక మధ్యలోనే కాడి పారేసి, లోక్సత్తా పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి, దాన్ని ఆపేసి, రాజకీయ పార్టీగా మార్చి విఫల ప్రయాణాన్ని అర్థాంతరంగా విరమించారు. చివరికి లోకమూ మిగలలేదు. సత్తా కూడా మిగలలేదు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్పల్లి నుంచి పోటీచేసి, పచ్చపార్టీతో రహస్య పొత్తుతో గెలిచిన ఆయనకు, 2014 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ (మల్కాజిగిరి) ప్రజలు ధరావత్తు కూడా దక్కకుండా మొత్తారు. దిష్టి తీసి నిప్పు మీద ఉప్పులు చిటపట అనిపించారు. ఎందుకంటే జేపీ వారికి తెలంగాణ మీద దాచుకోలేనంత ప్రేమ మరి. ఉద్యమం జరిగినన్ని రోజులూ ఆయన తెలంగాణ ఏర్పాటును మనసా వాచా కర్మణా వ్యతిరేకించారు. ఒక రాష్ట్రంగా తెలంగాణ మనుగడ సాగించలేదని శాపనార్థాలు పెట్టారు. తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డుకోవడానికి ఆయన ఢిల్లీ స్థాయిలో రహస్య ప్రయత్నాలు కూడా చేశారని చెప్తుంటారు. చివరికి అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణవాది ఒకరు గట్టిగా అర్సుకుంటే తప్ప, తత్వం కొద్దిగా బోధపడి, తర్కం అర్థమైంది! సరే, దేవుడి లీల ముందు మేధావులెంత? వారెన్ని ప్రయత్నాలు చేసినా, తెలంగాణ ఏర్పడిపోయింది.
రోమ్లో ఉన్నప్పుడు రోమన్లా ఉండు అని సామెత. తెలంగాణలో ఉండాలనుకున్నప్పుడు తెలంగాణ వాడిలా ఉండాలి. కానీ అప్పుడూ ఇప్పుడూ జేపీకి ఇది తెలిసినట్టు లేదు. ఏ గూటి చిలక ఆ పాట పాడుతుందనేది పాత లెక్క. చిలక పాడే పాటను బట్టి ఏ గూడో చెప్పగలమనేది నేటి సామెత. తెలంగాణలో ఏ కొత్త పథకం ప్రారంభమైనా.. విధాన నిర్ణయం జరిగినా దాన్ని ఎలా దెబ్బ కొట్టాలా? అని చూసే పచ్చ గొట్టాలకు, పిచ్చి కెమెరాలకు శ్రీమాన్ జయప్రకాశ్ నారాయణ ఒక కల్పవృక్షం. సరే.. రాష్ట్రం విడిపోయింది. రెండు రాష్ర్టాలు వేటికవి తమ మానాన తాము పనిచేసుకుంటున్నాయి. అక్కడా ఇక్కడా సామాన్యులనుంచి మేధావుల దాక తమతమ రాష్ర్టాలకు తోచిన, చేతనైన రీతిలో సహాయం చేస్తున్నారు. తమ రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటున్నారు. తెలంగాణలో మేధావులకేం గొడ్డుపోలేదు. ఎంతోమంది ఉన్నారు. ఆ మాటకు వస్తే తెలంగాణ ప్రభుత్వం కూడా అనేక మంది రిటైర్డ్ అధికారులు, సమర్థుల సలహాలు, సేవలు వినియోగించుకుంటున్నది. మరి ఈయన సలహాలు ఎవరడిగారు? ఎప్పుడు అడిగారు? ఇది మంచిది? ఇది చెడ్డది? అని చెప్పడానికి జేపీ ఎవరు? ఆయన సర్టిఫికెట్లు ఎవరికి కావాలి? అంతగా ఇచ్చుకోవాలంటే అయన ఎంతగానో అభిమానించే ఆంధ్రాలో ఇచ్చుకోవాలి. అది వదిలేసి తెలంగాణ మీద పడి ఏడ్వడం దేనికి? పోనీ బాగుపడేందుకు ఎన్నడన్నా మంచి సలహాలు ఇచ్చారా? అంటే అదీ లేదు. ఆ మాటకొస్తే ఏపీలో బాబు ఉన్నపుడు ఆయనకు సలహాలిచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్ ఎందుకు డెవలప్ కాలేదు? ఇవాళ అక్కడ రాజధాని లేదు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఇంకా ఎన్నో బాలారిష్టాలున్నాయి. ఒక మేధావి అయితే అక్కడకు వెళ్లి సర్కారుకు తగిన సూచనలిచ్చి బాగు చేసుకోవచ్చు. జన్మభూమి రుణం తీర్చుకున్నట్టూ అవుతుంది. అది చేయడు. ఇక్కడ కూర్చొని సలహాలు ఇస్తాడు.
‘తాడు చాలకపోతే అక్కడిదాక నుయ్యి పూడ్చు’ అన్నాడట వెనకటికెవరో! జేపీ నీతిసూత్రాలు అలాగే ఉంటాయి. ఆయన లెక్కల ప్రకారం కాళేశ్వరం వద్దు. ఖర్చు గిట్టుబాటు కాదు. బోర్లు వేసుకొంటే చాలు. హైదరాబాద్లో మెట్రో విస్తరణ అవసరంలేదు. ఖర్చు ఎక్కువవుతుంది. బదులుగా బస్సులు నడిపితే చాలట. అపుడెపుడో ఓ కేంద్రమంత్రి ఇలాగే ప్రజలకు సన్నబియ్యం అవసరం లేదు నూకలు తినిపించండి అన్నాడు. అదే ధ్వని ఈయన వ్యాఖ్యల్లో కనిపించండం లేదూ! మెట్రో స్పీడేమిటి? బస్సు స్పీడేమిటి? కనీసం ఆలోచించి ఉంటాడా? అపుడపుడైనా బీజేపీని, మోదీని ఆకాశానికి ఎత్తే జేపీకి తెలుసో లేదో.. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ప్రతి రాజధానిలో మెట్రో వేసుకోవాలని మోదీ నేతృత్వంలోని కేంద్రం ఆదేశిస్తున్నది. అనేక నగరాల్లో మెట్రో రైళ్లు వేస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ విస్తరణ శరవేగంగా జరుగుతుంది. ఆ మేరకు ప్రజారవాణా పెంచుకోవాలి.
మరి హైదరాబాద్ డెవలప్ కావద్దా? ఇక్కడ ప్రజారవాణా విస్తృతం కావద్దా? మేధావి ముసుగేసుకొని కుట్రలెందుకు? ఓసారి కాళేశ్వరం వేస్ట్ అంటాడు. ఇంకోసారి సంక్షేమ పథకాలు వద్దంటాడు. విద్యుత్తు మీద వ్యతిరేక వ్యాఖ్యానాలు చేస్తూ సలహాలు ఇస్తాడు. అయినా ఈయనను ఎవరు సలహాలు అడిగారు? సలహాలు ఇచ్చేందుకు ఆయనకున్న అర్హత ఏమిటి? ఐఏఎస్గా సక్సెస్ అయ్యారా? స్వచ్ఛంద సేవకుడిగా సక్సెస్ అయ్యారా? రాజకీయ నాయకుడిగా సక్సెస్ అయ్యారా? ఏం ఊడబొడిచారని ఉచిత సలహాలు! ఒక బ్యూరోక్రాట్గా ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు నేను ఈ మేలు చేయించిన అని చెప్పగలరా? మరి తెలంగాణలో ఏం జరిగింది ఇప్పుడు? ఇక్కడి పథకాలు దేశంలో ఇంకెక్కడైనా ఉన్నాయా? దేశంలో ఎక్కడైనా 24 గంటల కరెంటు ఉన్నదా? దేశంలో ఎక్కడైనా ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరు ఇస్తున్నారా? దేశంలో ఎక్కడైనా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఉన్నదా? మనంత తలసరి ఆదాయం ఈ దేశంలో ఎక్కడన్నా ఉన్నదా? మనలాగా తలసరి విద్యుత్తు వినియోగం దేశంలో ఎక్కడన్నా ఉన్నదా? మనంత ధాన్యం దిగుబడి ఎక్కడన్నా ఉన్నదా? ఇవన్నీ విజయాలు కావా? ఎన్నడన్నా ఈయన బంగారి నోటితో తెలంగాణ ఈ విజయాలు సాధించిందని అన్నాడా? అలాంటివి ఉండవు. బుడ్డర్ఖాన్ ఏషాలు, ఏడుపుగొట్టు ఏషాలకు మాత్రం తక్కువ లేదు.
జేపీని మహా మేధావిలా చిత్రీకరించే ప్రయత్నం చేసిందీ.. తెలంగాణ మీదకు వదిలిందీ ఆంధ్రా లాబీయే. ఆ లాబీ తెలంగాణ మీదికి వదిలిన అనేక చిలుకలు వివిధ రంగాల్లో అనేక వేషాల్లో లాబీ పలికించే పలుకులు వదుల్తుంటాయి. అనేక ఫోరంలు, వేదికలు, సంఘాలు, జెండాల పేరుతో వదిలిన బుడ్డర్ఖాన్లు నిత్యం తెలంగాణ మీదపడి ఏడుస్తుంటారు. అందుకే జేపీ గొంతులో ఆంధ్రా ఏడుపే మేధావితనం రూపంలో ప్రతిధ్వనిస్తుంది. ఆయనకు తెలంగాణ నచ్చదు. మొహమాటం ఏమీ లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వద్దని బాహాటంగానే చెప్పారు. ఇది ఒక స్వయంపోషక రాష్ట్రంగా మనుగడ సాగించలేదని అన్నారు. ఇక్కడ ఆర్థిక వనరుల మీద, కరెంటు మీద, నీటి లభ్యత మీద చాలా ఉదాహరణలిచ్చారు. సరే..తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పాటైంది. దాని మానాన దాన్ని వదిలేయలేదు. లేదూ తన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పనిచేయలేదు. తెలంగాణ పథకాల మీద.. పనితీరు మీద చేయని దాడి లేదు. సంక్షేమ పథకాల మీద చేయని వక్రీకరణ లేదు. ప్రజలు పన్నులు కడుతున్నారని పదేపదే చెప్తూ ప్రభుత్వం ఏదో ఆ డబ్బులను వృథా చేస్తున్నదన్నట్టు వ్యాఖ్యానాలు. ఉచితాలు వద్దు, కాళేశ్వరం వద్దు, ఉచిత విద్యుత్తు వద్దు.. ఇలా ఆయన వల్లించే అనేక ‘వద్దుల పద్దు’లో తాజాగా చేర్చిన మరో పథకం మెట్రో విస్తరణ. మెట్రో విస్తరణ అనేది అవసరమే లేదని ఆయన ఉవాచ. అంతకన్నా తక్కువ ఖర్చులో వందల బస్సులు కొనవచ్చట! దాంతో ప్రజారవాణా మెరుగుపరచవచ్చట. మరి అన్ని వందల బస్సులు తిరిగేందుకు తగ్గట్టు రోడ్లున్నాయా? అనేది ఆలోచించి ఉంటారా? అంటే.. మనకు తెలియదు.
జేపీకానీ, ఆయనను నడిపే లాబీలకుగానీ ఆంధ్ర తాబేదాైర్లెన పత్రికలకుగానీ తెలంగాణ బాగుపడటం అనే అంశం జీర్ణం కావడంలేదు. ఇవాళ తెలంగాణ అనేక రంగాల్లో అభివృద్ధిలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. ఇక్కడ అమలు చేసే పథకాలు దేశానికి ఆదర్శంగా మారుతున్నాయి. అనేక రాష్ర్టాలనుంచి అధికారులు ఇక్కడి పథకాలను పరిశీలించి పోతున్నారు. తెలంగాణలో రైతుకు అందుతున్న పథకాలు చూసి దేశంలోని మిగిలిన రాష్ర్టాల రైతులు తమకూ అలాంటి పథకాలు కావాలని గొంతెత్తుతున్నారు. ఇంటింటికీ శుద్ధి చేసిన జలం వస్తున్నాయంటే ఆశ్చర్యపడుతున్నారు. రైతు వేదికలు, వైకుంఠధామాలు, 24 గంటల కరెంటు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు.. ఏది చూసినా, ఏ రంగంలో చూసినా దేశంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నది. ఏముంది? ఓ పదేండ్లలో తెలంగాణ చతికిలపడిపోతుంది అనుకున్న పచ్చలాబీ ఈ ప్రగతిని చూసి గింజుకు చస్తున్నది. కసికొద్దీ ఏయే పథకాల్లో తెలంగాణ విజయం సాధించిందో వాటినే టార్గెట్ చేస్తూ కథనాలు పరిచి పచ్చ మీడియా పగబట్టినట్టు దాడులు చేస్తున్నది. అనేక ఫోరాలు, సంఘాలు సర్వేల పేరిట మరోవైపు నుంచి విషం కక్కుతున్నాయి. అందుకే కూడబలుక్కున్నట్టు కాళేశ్వరం ప్రాజెక్టు మీద, మెట్రో మీద దాడులు చేస్తున్నారు.
సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో అభివృద్ధి పేరుతో ఒక ప్లానింగ్ అనేది లేకుండా భవిష్యత్తు అనేది ఏమిటనే ఆలోచన లేకుండా ఇష్టారాజ్యంగా పనులు చేపట్టారు. ఇష్టం వచ్చినట్టు భవనాల నిర్మాణాలకు, కాలనీలకు అనుమతులు ఇచ్చేశారు. దానితో రోడ్లు ఆక్రమణలకు గురయ్యాయి. వాన నీటిని మళ్లించే డ్రెయిన్లు రోడ్ల విస్తరణలో ధ్వంసమయ్యాయి. వాటికి మనం ఇపుడు మూల్యం చెల్లించవలిసి వస్తున్నది. పాత తప్పులను సవరించి రహదారులు బాగుపరచాలనుకుంటే కోర్టుల్లో వ్యాజ్యాల వంటి అడ్డంకులు ఏర్పడి ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. సమైక్య పాలకుల కాలంలో నగరంలో కొన్ని ముఖ్యమార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు అనే పేరుతో అడ్డగోలుగా రోడ్లు వైడెనింగ్ చేపట్టారు. ఇందులో ప్రధానంగా వాన నీటిని మళ్లించే వ్యవస్థను నాశనం చేశారు. నిజాం కాలంలో ఎంతో ముందు చూపుతో ఒక శాస్త్రీయ పద్ధతిలో హైదరాబాద్ రహదారుల నిర్మాణం జరిపారు. అన్ని ముఖ్య రహదారుల్లో ప్రతి రోడ్డుకు 10 నుంచి 20 అడుగుల స్థలాన్ని వాననీటి మళ్లింపు కోసం డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేశారు. సమైక్య పాలకులు రోడ్ల విస్తరణ పేరుతో వీటన్నింటినీ పూడ్చేసి రోడ్లు వేశారు. ప్రధానంగా ఎన్టీఆర్ సీఎంగా ఉన్నకాలంలోనే ఇది ఎక్కువగా జరిగింది. అపుడు ఆయనకు అత్యంత ఆప్తుడైన సలహాదారు జేపీనే! ఆనాటి అనాలోచిత పనుల కారణంగా వర్షాకాలంలో రహదారుల మీద నీరు ఎటూ పోలేని పరిస్థితి. దీనితో గంటలకు గంటలు ట్రాఫిక్జామ్. తెలంగాణ వచ్చేవరకు ప్రజలు రహదార్ల మీద నిత్యనరకాన్ని చూశారు. ఎన్టీఆర్, చంద్రబాబులకు అత్యంత సన్నిహితులుగా ఉన్న కాలంలో ఈ మేధావి ఏం చేసినట్టో..!
ఇవాళ హైదరాబాద్ పరిస్థితి ఏమిటి? నగరం నానాటికీ పెరిగిపోతున్నది. ఓఆర్ఆర్ పరిధిలోనే ఒకటిన్నర కోట్ల మంది నివసిస్తున్నారు. సుమారు 80 లక్షల వాహనాలు నగర రోడ్ల మీద ప్రయాణిస్తున్నాయి. ప్రతిరోజూ 15 లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. ఇందులో 60 శాతం ద్విచక్ర వాహనాలు. 40 శాతం కార్లు, బస్సుల వంటి వాణిజ్య వాహనాలు. ఇవికాక రోజుకు కొత్తగా దాదాపు 1200 కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. వీటికితోడు రోజుకు నగరానికి సుమారు పదివేల మంది కొత్తగా వస్తున్నారు. దీంతో రహదారులు చాలటం లేదు. ప్రైవేటు వాహనాలు ఎంత పెరిగితే అంత కాలుష్యం. రద్దీ అనేది నగరాల ముఖ్య లక్షణం. దాన్ని ఎంత సమర్థంగా అదుపులోకి తెచ్చుకుంటామన్నదే ప్రభుత్వాల పనితీరుకు గీటురాయి. అనేక దేశాల్లోని ముఖ్య నగరాలు ట్రాఫిక్ సమస్యతో అల్లాడిపోయినవే. ఆ సమస్యకు మెట్రోనే పరిష్కారమని భావించి అందుబాటులోకి తెచ్చారు. చైనా, సింగపూర్ వంటి దేశాలు మెట్రోను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయి. సింగపూర్లో ఎక్కడ కొత్తగా ఏ కమ్యూనిటీ అభివృద్ధి చేస్తున్నా ఆ వెంటనే అక్కడికి మోనో రైలు వేస్తున్నారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ సింగపూర్, చైనాలో పర్యటించినపుడు ఈ ప్రజా రవాణా వ్యవస్థను అధ్యయనం చేశారు. సింగపూర్ రైల్వే వర్క్షాప్లో ఆయన ఐదు గంటలపాటు గడిపి అనేక విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాతే హైదరాబాద్లో మెట్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సింగపూర్ 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నది. అంత చిన్న ప్రదేశంలో అత్యధిక జనసాంద్రత ఉండటం వల్ల కాలుష్యం వ్యాపించకుండా ప్రైవేటు వాహనాల కొనుగోలుపై మూడు రెట్ల పన్నులు వేసి కొనుగోళ్లు బాగా తగ్గించారు. అక్కడ 90 శాతం ప్రజలు వాహనాలు కొనరు. మోనో రైలునే వినియోగిస్తారు. బస్సులు రెండో ప్రియారిటీ మాత్రమే. అనేక దేశాలు ఇలాంటి వ్యవస్థలనే ప్రోత్సహిస్తున్నాయి. ట్రాఫిక్ సమస్యకు ఇదే పరిష్కారమని ముక్తకంఠంతో చెప్తున్నాయి. వేగంగా పరిగెత్తే ప్రపంచానికి అంతే వేగంగా పరుగులు తీసే ప్రజారవాణా ఈ శతాబ్దపు అవసరం. మెట్రోలు, మోనో రైళ్ల వల్ల కాలుష్య నివారణతోపాటు సమయం ఆదా అవుతుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అంతకు మించి ఉత్పాదకత పెరుగుతుంది. మెట్రో విద్యుత్తుతో నడిచే ప్రజారవాణా. గ్రీన్ ఎనర్జీ. హైదరాబాద్ మెట్రోలో రోజూ 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీళ్లంతా ప్రైవేటు వాహనాల్లో ప్రయాణిస్తే వెలువడే కార్బన్ కాలుష్యాలు తగ్గినట్టే. వీటన్నింటికీ పరిష్కారం మెట్రోనే.
హైదరాబాద్నే తీసుకొంటే.. నగరం మధ్యలోనుంచి ఎయిర్పోర్టుకు వాహనంలో వెళ్తే గంటన్నర పడుతుంది. ఈ మార్గంలో మెట్రో వస్తే ఈ సమయం సగానికి పైగా తగ్గుతుంది. ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదించిన విస్తరణ జరిగితే ఇతర జిల్లాల నుంచి వాహనాల్లో వచ్చేవారు నగరానికి బయటే తమ వాహనాలు నిలుపుకొని మెట్రోలో నగరంలోపలికి వచ్చి పనులు చూసుకొని తిరిగి మెట్రోలో వెళ్లి అక్కడి నుంచి తమ సొంత వాహనాల్లో జిల్లాలకు వెళ్లి పోవచ్చు. నగరంలోకి వచ్చి ట్రాఫిక్లో ఇరుక్కొని సమయం వృథా చేసుకోవాల్సిన అవసరం రాదు. పేదలు, మధ్యతరగతి ప్రజలను వీలున్న అన్ని మార్గాల్లో ఆదుకోవడం ప్రభుత్వాల కర్తవ్యం. ఆర్టీసీ, మెట్రో వంటి చౌక రవాణాను వారికి సమకూర్చడం ప్రభుత్వ బాధ్యత. వీటిని లాభాల కోసం నడపరు. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు. ఆదాయాలు పెంచుకోవడానికి అనేక ఇతర మార్గాలున్నాయి.
హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్నది. రోజూ అనేక కొత్త సంస్థలు వస్తున్నాయి. ఇతర రాష్ర్టాల నుంచి లక్షల సంఖ్యలో జనం వస్తున్నారు. ఒక అంచనా ప్రకారం 2040 నాటికి హైదరాబాద్ జనాభా 3 కోట్లు దాటుతుంది. ఇపుడు ఓఆర్ఆర్ వరకు విస్తరించిన నగరం మున్ముందు ట్రిపుల్ ఆర్ వరకు విస్తరిస్తుంది. ఇదేం అసాధ్యం కాదు. రెండు దశాబ్దాల క్రితం నగరం అవసరాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు వేశారు. అపుడు నగరం ఆ పరిధి లోపలే ఉండేది. దాని తర్వాత ఓఆర్ఆర్ వేశారు. ఇపుడు నగర విస్తరణ దాన్ని దాటి ముందుకు పోతున్నది. రేపు ట్రిపుల్ ఆర్ వరకూ నగరం విస్తరిస్తుంది. ప్రభుత్వం వచ్చే పదేండ్ల అభివృద్ధిని, ఓఆర్ఆర్ను దాటి విస్తరిస్తున్న శాటిలైట్ టౌన్షిప్లను రాబోయే విస్తరణను దృష్టిలో పెట్టుకొని మెట్రో విస్తరణ చేపట్టింది. ఇందులో దూరదృష్టి, భవిష్యత్తు అవసరాలు చూస్తున్నారు. జేపీ అయినా మరొకరెవరైనా గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే.. ఇవాళ తెలంగాణ భారతదేశానికే తలమానికంగా మారుతున్నది. ఇతర దేశాల నుంచి వచ్చినవాళ్లు, సినిమా నటులు, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చినవాళ్లు, పేరొందిన టెక్నోక్రాట్స్.. వీళ్లాంతా పొగుడుతున్నారు. అవన్నీ చూడకుండా, అట్లాంటివాళ్లను పట్టించుకోకుండా వీళ్లు డ్రామాలు చేస్తున్నారు. తెలంగాణ గడ్డమీద నిలబడి ఈ ప్రాంతం బాగుపడితే ఓర్చుకోలేకపోతున్నారు. రోమ్లో ఉన్నపుడు రోమన్ లాగా ఉండాలనేది సామెత. బీజేపీ పార్టీ ఓ అడుగు ముందుకు వేసి భారతదేశంలో ఉండాలంటే భారతీయుల్లాగా ఉండాలంటూ ప్రకటనలు చేస్తున్నది. వీళ్ల ధోరణి ఇలాగే ఉంటే ఇక్కడి జనం కూడా తెలంగాణలో ఉండాలంటే తెలంగాణవాడిలాగా ఉండాలని నినదించే రోజు కూడా వస్తుంది. తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణ వాడిలా ఉండాలి!
మనిషి ఏడుపు మంచిది కాదు.. పెద్దలు చెప్పిన మాట ఇది. అలాగే కొన్ని చూపులు అస్సలు మంచివి కావు. పచ్చటి చెట్లు కూడా నిలువునా ఎండిపోతాయట.ఈ మాటా పెద్దలు చెప్పిందే. అదేంటో తెలంగాణ మీద అందరికీ ఏడుపే. పడి బతకడానికి అందరికీ ఇదే తెలంగాణ కావాలి. హైదరాబాద్ కావాలి. చదువులకు, వైద్యానికి, ఉద్యోగాలకు, ఉపాధికి, ఇల్లు కట్టకొని స్థిరపడటానికి.. అన్నింటికీ కావాలి. కానీ అదే తెలంగాణ మీద పడి రోజూ ఏడ్వాలి. హైదరాబాద్లో నాలుగు చినుకులు పడితే ఓ సినిమావాడు ఇక మీద నేను బోట్ కొంటాను అంటూ సోషల్ మీడియాలో వెకిలి కామెంట్లు పెడతాడు. ఇంకొకడు కాళేశ్వరం నీళ్లు వెనక్కి వెళ్తున్నాయని చిల్లర వ్యాఖ్యలు చేస్తాడు. ఇదో వింత రోగం. ఇది పచ్చ మీడియాకు, పచ్చలాబీ పోషించే మేధావులకు మరీ ఎక్కువ. ఎంతటి కడుపుమంట అంటే తెలంగాణ ఎడారిగానే ఉండాలి. వర్గపోరాటాలతో ప్రజలు కొట్టుకు చావాలి. ఇక్కడికి నదుల నీళ్లు రాకూడదు.. భరించలేరు.
హైదరాబాద్ ట్రాఫిక్ జాంలతో అతలాకుతలం కావాలి. మెట్రో విస్తరణ జరగకూడదు. ఒకడు మల్లన్నసాగర్తో భూకంపాలు వస్తాయా? అంటూ చర్చ పెడతాడు. ఇంకొకడు హైదరాబాద్కే భూకంపం వస్తే? అని కార్యక్రమం చేస్తారు. సింపుల్స్ శాంపిల్స్ చూపించి ఒకడు ఉగ్రవాదుల అడ్డా అంటే, ఇంకొకడు ఈ నగరానికి ఏమవుతోంది? అంటూ శోకాలు తీస్తాడు. ఎవరెన్ని శోకాలు పెట్టినా, దీర్ఘాలు తీసినా, విషం చిమ్మినా.. మూసీ నదికి కూతవేటు దూరంలో రొమ్ము విరుచుకొని సగర్వంగా నిలబడ్డ చార్మినార్లా తెలంగాణ చెక్కు చెదరదు.. హైదరాబాద్ చెక్కు చెదరదు. ఎట్లా ఉండే హైదరాబాద్ ఎట్లా తయారైంది? ఎట్లా తయారు చేసుకున్నాం. పదేండ్లుగా మతకలహాల ముచ్చట లేదు. కరెంటు కోతల బాధ లేదు. మంచినీళ్ల తిప్పలు లేవు. ట్రాఫిక్ జాం జంఝాటం చాలావరకు తగ్గింది. ఎన్ని ఫ్లై ఓవర్లు కట్టుకున్నాం! ఎన్ని అండర్పాస్లు, స్కైవేలు, స్కైవాక్లు, స్టీల్ బ్రిడ్జిలు తెచ్చుకున్నాం! ఎన్ని పరిశ్రమలు రప్పించుకున్నాం! బెస్ట్ లివింగ్ సిటీ అని ఎన్ని సర్వేల్లో ఈ నగరం పేరు మార్మోగింది! ‘ఇది ఒకప్పటి హైదరాబాద్లా లేదు’..అంటూ అనని ఎన్నారైలు లేరు. ఆ మధ్య రజనీకాంత్ ఈ నగరాన్ని న్యూయార్క్తో పోల్చారు. నటి లయ అమెరికాలో కూడా ఇన్ని ఆకాశ హార్మ్యాలు కనిపించలేదని అబ్బుర పడ్డారు. ఇక్కడి పచ్చదనాన్ని ఎక్కడో అమెరికాలో ఉండే పర్యావరణ వేత్తలు గొప్పగా చెప్పారు. దీంతో జేపీ బాపతు సమూహాలకు అజీర్తి ఎక్కువైంది. అందుకే తెలంగాణ మీద ఏడుపులు ఎక్కువయ్యాయి. సదరు అజీర్తి బంధంలో ఆరున్నొక్క శృతిలో రాగం అందుకునే వారిలో జయప్రకాశ్ నారాయణ అలియాస్ జేపీ ప్రథములు.
పది, పదిహేను ఏండ్ల తర్వాత హైదరాబాద్ ఎంత ఉజ్వలంగా మారుతుంది? ఓ వైపు ఆర్ఆర్ఆర్.. మధ్యలో ఓఆర్ఆర్.. దానికి అనుగుణంగా అన్ని హైవేలతో మెట్రో కనెక్టివిటీ. 8-9 జాతీయ రహదారులతో అనుసంధానం.. రాజీవ్ రహదారి, శ్రీశైలం హైవే, విజయవాడ హైవే, బెంగళూరు హైవే, ముంబై హైవే, కర్నూలు హైవే.. ఇలా అన్ని హైవేలతో మెట్రోతో కనెక్టివిటీ. ఇంకో 20 – 30 కిలోమీటర్లు విస్తరించే హైదరాబాద్. ఈ సుందర దృశ్యాన్ని ఓసారి ఊహించుకోండి! తెలంగాణ ఎట్లుంటదో.. హైదరాబాద్ ఎట్లుంటదో..! మనం ఊహించుకుంటున్నామో లేదోగానీ, ఈ గుంపులు మాత్రం తప్పక ఆ దృశ్యాన్ని ఊహించుకుంటున్నాయి. అందుకే ఈ ఏడుపు. వాళ్ల రాష్ట్రం నాశనం చేసుకున్నారు. ఏమీ చేయలేక ఇతరుల మీద పడి శోకాలు పెడ్తున్నారు.
మూడు దశాబ్దాల క్రితం దేశంలో ఒక కొత్త ట్రెండ్ కనిపించింది. ముంబైలో అక్కడి కమిషనర్ రోడ్ల విస్తరణలో నాయకుల ఒత్తిడి లెక్క చేయకుండా పనిచేశారు. మీడియా కీర్తించింది. అలాగే పంజాబ్లో ఓ ఐఏఎస్ అక్కడి అవినీతి నాయకులను వణికించారు. మీడియాలో మార్మోగింది. ఇదే రకంగా అనేక రాష్ర్టాల్లో అధికారులు రూల్ ప్రకారం పనిచేయడం, మీడియా సపోర్ట్గా నిలవడంతో నాటి ప్రభుత్వాలు చేష్టలుడిగి చూశాయి. ఇంగ్లిష్ మ్యాగజైన్లు ఇలాంటి అధికారులపై కవర్పేజీ ఫొటోలతో ప్రత్యేక కథనాలు రాస్తూ ప్రజలు ఇలాంటి వాళ్లు నాయకులుగా రావాలని కోరుతున్నారని ముక్తాయింపులు ఇచ్చాయి. ఒకరిద్దరు అధికారులు ఇలా రాజకీయ ప్రవేశాలు కూడా చేశారు. యాదృచ్చికమా! ఎత్తుగడా తెలియదుగానీ సరిగ్గా ఇదే సమయంలో నాటి ఉమ్మడి రాష్ట్రంలో పచ్చ మీడియా ఒక అధికారిని నీతివంతుడు, సమర్థుడు అంటూ ప్రచారాలు చేసి ప్రజల్లో పాపులర్ చేసింది. తెలుగు పత్రికల్లో ఒక అధికారికి పావుపేజీ, అరపేజీ స్థలం కేటాయించడం అదే మొదటిసారి. రేపటి కాలంలో ఒకవేళ అధికారులే నాయకులుగా మారే ట్రెండే వస్తే అందుకు మన తరఫున ఒకరుండాలి అనేది పచ్చమీడియా ఎత్తుగడ అని వినిపించింది. ఏమైనా సదరు అధికారి చివరకు రాజకీయ నాయకుడయ్యాడు. ఎమ్మెల్యే కూడా అయ్యాడు. అంతటితో ఆయన రాజకీయ ప్రస్తానం ముగిసి, ఇపుడు టీవీ చర్చల్లో మేధావి పేరుతో తెలంగాణ మీద జడ్జిమెంట్లు ఇస్తున్నారు. ఆయనే మహారాజశ్రీ జయప్రకాశ్ నారాయణ.
జయప్రకాశ్ నారాయణ, ఆయన తాబేదారు పత్రిక ఆయన సమూహం ఏమని ఊహించారు? ఏమని ఇమేజ్నేషన్ చేసుకున్నరు? ఓ 9-10 ఏండ్లలో తెలంగాణ ఆగమై పోతుంది. కరెంటు ఉండదు. నీళ్లు ఉండవు. పైసలు ఉండవు అనుకున్నారు. ఓ అంచనా వేసుకున్నారు. అంతేకాదు.. ఓ పదేండ్లలోనే మళ్లా ఆంధ్రాలో కలపాలనే కూనిరాగాలు, నినాదాలు మొదలవుతాయనుకున్నారు. అపుడు మనం ఏదో కతలు పడి, కుట్రలు చేసి విలీన నినాదం ఎత్తుకోవచ్చు అనుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్లు గనుక, అదృష్టవంతులు గనుక కేసీఆర్ను గెలిపించుకున్నారు. ముఖ్యమంత్రిని చేసుకున్నారు. దాంతో వాళ్ల అంచనాలన్నీ తలకిందులయ్యాయి. తెలంగాణ ఆంధ్రాలో కలవాలని కాదు. కేసీఆర్ ఆంధ్రాకు రావాలనే డిమాండ్ మొదలైంది. బీఆర్ఎస్ ఆంధ్రలో అధికారంలోకి రావాలనే డిమాండ్లు మొదలైనయ్. దీన్ని తట్టుకోలేక పోతున్నారు.
మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ ప్రభుత్వ ఉద్యోగులందరికీ క్షమాపణ చెప్పాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సరికాదని, ఉద్యోగులు ప్రభుత్వానికి గుదిబండ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలోని ఉద్యోగులందరి మానసిక సె్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. గతంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన ఆయనే ఇప్పుడు అదే ప్రభుత్వ ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటు. ఆయన మతిభ్రమించినట్టుగా మాట్లాడుతున్నారు. ఉద్యోగ భద్రత లేక దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ మానవీయ కోణంతో భరోసా కల్పించిన విషయం మరువొద్దు.
– రాష్ట్ర రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి
తెలంగాణ అభివృద్ధి విషయంలో మాజీ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ వితండ వాదనలకు దిగుతున్నారు. సుదీర్ఘకాలంపాటు ప్రభుత్వ పాలనా యంత్రాంగంలో పనిచేసిన ఆయన వ్యాఖ్యల అంతర్యంపై అనుమానాలు ఉన్నాయి. హైదరాబాద్ నగరానికి మణిహారంగా, రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేలా ఓఆర్ఆర్ మెట్రోను సాధనంగా ప్రభుత్వం భావిస్తే, అందులోని లోపాలను సూచించాల్సింది పోయి, విపరీత ధోరణితో కూడిన వ్యాఖ్యలు చేయడమేమిటి. దీనిపై ఆయన స్వీయ పరిశీలన చేసుకోవాలి. పెరుగుతున్న హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా మెరుగైన రవాణా సదుపాయాలు కావాల్సిందే.
– చింతా గణేశ్, సామాజికవేత్త
హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో దూరదృష్టితో ఈ పనికి పూనుకోవడం అభినందనీయం. కానీ కొందరు కుహనా మేధావులు ఎటువంటి కారణాలు చెప్పకుండా దీనిని వ్యతిరేకించడం వారి మూర్ఖత్వానికి నిదర్శనం. పార్టీ, ప్రభుత్వంపై వ్యతిరేకతతో ప్రభుత్వం ఏది చేపట్టినా మేము వ్యతిరేకిస్తామనే విధానం సరికాదు. ఇప్పటికే హరితహారంలో భాగంగా నగరం చుట్టూ పచ్చని చెట్లను పెంచి, కాలుష్యాన్ని తగ్గించారు. సీఎం కేసీఆర్ సదుద్దేశంతో ఓఆర్ఆర్ మెట్రో ప్రాజెక్టును పట్టాలెక్కించడం గొప్ప విషయం.
– ప్రొఫెసర్ సీ వెంకటేశ్వర్, తెలంగాణ స్టేట్ లెవల్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ సభ్యుడు
✍️ సవాల్ రెడ్డి