Inter Exam Fee | హైదరాబాద్ : ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులను ఇంటర్మీడియట్ బోర్డు అప్రమత్తం చేసింది. వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజును ఇప్పటికీ చెల్లించని విద్యార్థులు.. ఆలస్య రుసుం రూ. 2500తో జనవరి 25వ తేదీ వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఇంటర్ రెగ్యులర్, వొకేషనల్ విద్యార్థులతో పాటు ప్రయివేటు విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
మిక్స్డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ఉన్న ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. 2024-25 విద్యాసంవత్సరానికిగానూ ఫైర్ నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మిక్స్డ్ ఆక్యుపెన్సీ కాలేజీలకు అనుమతివ్వాలన్న ప్రైవేట్ కాలేజీల విజ్ఞప్తితో ఈ ఒక విద్యాసంవత్సరానికి అనుమతినిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 217 కాలేజీల్లోని 70 వేల మంది విద్యార్థులకు ఊరట కలిగింది.
ఈ క్రమంలో ఆ విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోవద్దనే ఉద్దేశంతో వార్షిక పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇంటర్ వార్షిక పరీక్షలను మార్చి 5 నుంచి 25 వరకు నిర్వహించనున్నారు. ఫస్టియర్ విద్యార్థులకు మార్చి 5 నుంచి, సెకండియర్ విద్యార్థులకు మార్చి 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి..
Telangana | ఐటీఈతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఎంవోయూ
Nagarkurnool | కల్లు సీసాలో కట్ల పాము ప్రత్యక్షం.. షాకైన బాధితుడు